న్యాయవాద దంపతుల హత్య దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం 

రాజకీయంగా కలకలం రేపిన న్యాయవాదుల దంపతుల హత్య కేసులో పోలీసుల  దర్యాప్తు తీరుతెన్నులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షులు కల్పిస్తున్న రక్షణ ఏమిటని ప్రశ్నించింది. న్యాయవాద దంపతులు గట్టు వామాన్ రావు, నాగమణి హత్యలపై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదికను అధికారులు హైకోర్టుకు సమర్పించగా, విచారణ సందర్భంగా పోలీస్‌శాఖపై హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది.

ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారు? ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది.

 ‘‘హత్యకు గురైన న్యాయవాద దంపతుల్లో గట్టు వామన్‌రావు ఘటనా స్థలంలోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన్ను అంబులెన్సులో తరలిస్తున్నప్పుడే స్థానిక ఎమ్మార్వో లేదా గెజిటెడ్‌ ఆఫీసర్‌ సమక్షంలో మరణ వాంగ్మూలాన్ని ఎందుకు నమోదు చేయలేదు?’’ అని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)ను హైకోర్టు ప్రశ్నించింది.

 ఈ కేసులో నిందితుల నేరాంగీకార వాంగ్మూలాలను మేజిస్ట్రేట్‌ ముందు ఎందుకు నమోదు చేయలేదని నిలదీసింది. పోలీసుల సమక్షంలో ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలాలు కోర్టు ముందు నిలువజాలవనే అంశం తెలియదా? అని ప్రశ్నించింది. కేవలం ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలే మేజిస్ట్రేట్‌ ముందు నమోదు చేశారు. మిగిలిన వారి వాంగ్మూలాల నమోదుకు ఇంకెంత కాలం పడుతుంది?’’ అని ఆరా తీసింది. 

హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసులు మొబైల్ ఫోన్స్, రక్తపు మరకలను, కాల్‌డాటాని, నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తేలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను కూడా సాక్షులుగా గుర్తించామని ఏజీ కోర్టుకు తెలిపారు.

నేరస్థుల నుంచి నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందని, అందుకే సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద స్టేట్‌మెంట్‌ రికార్డు చేశామని తెలిపారు. పూర్తి సాక్ష్యాలు సేకరించడానికి గాను మరో రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం మార్చ్ 15కు వాయిదా వేసింది.  

తదుపరి విచారణ నాటికి దర్యాప్తు తీరును వివరిస్తూ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది.

పెద్దపల్లిలో జరిగిన న్యాయవాదుల హత్య ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ దారుణంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని పేర్కొంది.