భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మరో ప్యాసింజర్‌ రైలు  

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మరో ప్యాసింజర్‌ రైలు ప్రారంభంకానుంది. బంగ్లాదేశ్‌ స్వతంత్ర దినోత్సవమైన మార్చి 26న ఇరు దేశాల మధ్య మూడో రైలు సర్వీసును ప్రారంభించాలని ఇరుదేశాల అధికారులు నిర్ణయించారు. మార్చి 26న ఈ ప్యాసింజర్‌ రైలును ఇరు ప్రధానులు సంయుక్తంగా ప్రారంభించనున్నారని తెలిపారు.

ఈ ఇరుగు పొరుగు దేశాలమధ్య ఇప్పటికే మైత్రి ఎక్స్‌ప్రెస్‌, బంధన్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో రెండు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి. ఈనెల 21న జరిగిన బంగ్లాదేశ్‌ రైల్వే, నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటీర్‌ రైల్వే అధికారులు ఈ మేరకు నిర్ణయించారు. ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయని తెలిపారు.

ఈ రైలు సిలిగురి జిల్లాలోని జల్పాయ్‌గురి (భారత్‌)-ఢాకా (బంగ్లాదేశ్‌) మధ్య వారానికి ఒకసారి నడుస్తుందని, ఇందులో ఆరు టూ టైర్‌, రెండు ఏసీ చైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయని వెల్లడించారు. భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఐదు రైల్వే లింకులు ఉన్నాయి. అవి పెట్రపోల్‌-బెనాపోల్‌, జేడ్‌-దర్షనా, సింఘాబాద్‌-రోహన్‌పూర్‌, రాధికాపూర్‌-బిరోల్‌, హల్దిబారి-చిలాహటి మధ్య ఇప్పటికే రైల్లే లింకులు ఉన్నాయి.

కూచ్‌బేహార్‌లోని హల్దిబారి-బంగ్లాదేశ్‌లోని చిలాహటి మధ్య 55 ఏండ్ల తర్వాత రైల్వే సర్వీసులు గత డిసెంబర్‌లో పునరుద్ధరించారు. 1966లో బంగ్లాదేశ్‌ ఏర్పడకముందు అంటే తూర్పు పాకిస్థాన్‌గా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య ఈ మార్గంలో రైలు సర్వీసులు నిలిచిపోయాయి.