కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 22న అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆ ప్రభుత్వం మైనార్టీలో పడిందని విపక్షాలు తెలిపాయి.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సంఖ్యాబలం ఉన్నదా లేదా అన్నది సోమవారం నాటి బలపరీక్షతో తేలుతుందని తమిళి సై తెలిపారు. తెలంగాణ గవర్నర్గా ఉన్న ఆమె, కిరణ్ భేడి స్థానంలో పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలను బుధవారం స్వీకరించారు.
మరోవైపు తమ ప్రభుత్వం మైనార్టీలో పడిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఖండించారు. తమకు తగిన సంఖ్యాబలం ఉన్నదని తెలిపారు. పుదుచ్చేరి అసెంబ్లీలో మొత్తం 30 స్థానాలుండగా కాంగ్రెస్కు 15 మంది సభ్యులున్నారు. ముగ్గురు డీఎంకే, ఒక ఇండిపెండెంట్ సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అయితే ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 14కు సమానమైంది. ప్రస్తుతం మెజార్టీ మార్క్ 15 కాగా, అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ఈ నేపథ్యంలో బలపరీక్షకు డిమాండ్ చేయగా ఎల్జీ తమిళిసై దీనికి సమ్మతించారు. సీఎం నారాయణ స్వామి ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని కోరారు. ఈ లోగా మరో ఇద్దరు కాంగ్రెస్ శాసన సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయవచ్చనే కధనాలు వెలువడుతున్నాయి.
More Stories
మోదీ – మమతా మధ్య పోరుగా మారిన బెంగాల్ ఎన్నికలు
కర్ణాటక రెబెల్ నేత ఈశ్వరప్పపై బీజేపీ వేటు
వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్