మతం మారితే ఎస్సీలు రిజర్వేషన్లకు అనర్హులే

ఎస్సీలు క్రైస్తవం, ఇస్లాం మతంలోకి మారితే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌ సౌకర్యాలు కోల్పోతారని కేంద్ర న్యాయ, చట్టశాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు. 

బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల జాబితాలోని అనేకమంది మతమార్పిడి చేసుకున్నప్పటికీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసి, పదవులు అనుభవిస్తున్నారని, అలాంటి వారిని అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ చేసే ఆలోచన ఉందా? అని జీవీఎల్‌ సభలో ప్రశ్నించారు. 

దీనికి మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బదులిస్తూ.. ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. అయితే ఎన్నికల నామినేషన్ల సమయంలోనే వారు మతం మార్చుకున్నట్టు రిటర్నింగ్‌ అధికారులకు సాక్ష్యాలతో ధ్రువీకరిస్తే వారి నామినేష్లను తిరస్కరించవచ్చని చెప్పారు.