తమిళనాడు ఎన్నికల బరిలో సినీ నటి రాధిక

సీనియర్ నటి రాధిక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. వనియంబాడిలో జరిగిన ఒక జోనల్ సమావేశంలో మాట్లాడుతూ ఆమె భర్త, నటుడు, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

 ప్రస్తుతానికి తాము అన్నాడీఎంకే కూటమితోనే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సమర్థవంతమైన నాయకుడు ఆయన కొనియాడారు. తన పార్టీ అభ్యర్థులు ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారో త్వరలో తెలియజేస్తామని ఆయన చెప్పారు.

 తాను ఇక నుంచి సినిమాలను తగ్గించుకొని, రాజకీయాలపై దృష్టి పెడతానని తేల్చి చెప్పారు. తన నటనతో ఎంతోమందిని మెప్పించిన రాధిక.. ప్రస్తుతం సమత్తువ మక్కల్‌ కట్చి మహిళా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

ఇలా ఉండగా, కాంగ్రెస్‌లో ఏళ్ల తరబడి శ్రమించిన నేత కరాటే త్యాగరాజన్‌. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినానంతరం రజనీకాంత్‌ పార్టీ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూశారు. అయితే అది కార్యరూపం దాల్చలేదు.  దీంతో త్వరలో ఆయన బీజేపీలోకి చేరడం ఖాయం అని మద్దతుదారులు పేర్కొంటున్నారు.