130 బిలియన్ డాలర్లతో సైన్యం ఆధునీకరణ 

రాబోయే ఏడేనిమిదేళ్లలో మిలిటరీ  సైనిక ఆధునీకరణకు 130 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని యోచిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించాయిరు. కర్ణాటక యలహంకలో ఏరో ఇండియా- 2021 ప్రదర్శనను రక్షణమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)తో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ, హెచ్‌ఏఎల్‌ ప్రతినిధులు దస్త్రాలను మార్చుకున్నారు.

ఈ ఒప్పందం విలువ‌ రూ.48 వేల కోట్లు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సమక్షంలో రక్షణశాఖ అధికారులు, తేజ‌స్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు గత నెల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో తాజాగా ఈ ఒప్పందం జ‌రిగింది. దీనిపై రాజ్‌నాథ్‌ హర్షం వ్యక్తంచేశారు. రక్షణ రంగ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మేకిన్‌ ఇండియా రక్షణ ఒప్పందం అవుతుంద‌ని చెప్పారు.

అనంతరం రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ  మహమ్మారితో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఈ ఏడాది ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. ఏరో ఇండియా-21 భారతదేశం విస్తారమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని, రక్షణ.. ఏరోస్పేస్ రంగంలో దేశం అందించే బహుళ అవకాశాలను ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు.

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ ఏరో డిఫెన్స్ ఎగ్జిబిషన్‌ నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో 80 విదేశీ కంపెనీలు, రక్షణ  మంత్రులు, ప్రతినిధులు, సర్వీస్ చీఫ్‌లు సహా 540 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని సమాచారం ఉందని, ఇది ప్రపంచ సమాజంలో పెరుగుతున్న ఆశావాదాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ప్రదర్శనలో వ్యక్తిగతంగా చేరిన మాల్దీవులు, ఉక్రెయిన్, ఈక్వెటోరియల్ గినియా, ఇరాన్, కొమోరోస్, మడగాస్కర్ దేశాల రక్షణ మంత్రులతో పాటు ఇతర సంస్థలకు ఏరో ఇండియాలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి వివరించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌’ విధానంపై దృష్టి సారించామని చెబుతూ  భారత ప్రభుత్వం రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్‌ రూట్‌ ద్వారా 74శాతం, ప్రభుత్వ మార్గం ద్వారా 100 శాతం వరకు పెంచిందని గుర్తు చేశారు.  దీంతో విదేశీ సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స‌రిహ‌ద్దుల్లో శ‌త్రువులు దుస్సాహసాల‌కు పాల్పడితే తిప్పికొట్టేందుకు భార‌త సేన‌లు సిద్ధంగా ఉన్నాయ‌ని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. లఢ‌క్‌‌ సరిహద్దుల్లో భారత్-చైనా ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారు. భౌగోళిక సమగ్రతను కాపాడుకునేందుకు, దేశ ప్రజల రక్షణకు భారత సైన్యం సంసిద్ధంగా ఉన్న‌ద‌ని చెప్పారు. స‌రిహద్దుల్లో క‌ట్టుదిట్టంగా బ‌ల‌గాల‌ను మోహ‌రించామ‌ని, శ‌త్రు దేశాల సేన‌లు ఎలాంటి దుస్సాహ‌సం చేసినా వెంట‌నే తిప్పికొట్టేందుకు సైన్యం అప్రమత్తంగా ఉన్న‌దని తెలిపారు.  

కాగా, ఈ కార్యక్రమానికి క‌ర్ణాట‌క‌ ముఖ్యమంత్రి యెడియూరప్ప కూడా హాజ‌ర‌య్యారు. నేటి నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ ఎయిర్ షో జరుగనుంది. క‌రోనా నేప‌థ్యంలో సాధారణ ప్రేక్షకులకు డిజిటల్‌ వేదికల ద్వారా ఈ ప్రదర్శనను వీక్షించే వీలు కల్పించారు. ఈ ఎయిర్ షోలో ప్రపంచ దేశాల్లోని 601 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఆద్యంతం ఆసక్తి కలిగించే రఫేల్‌ జెట్, అమెరికా అపాచి హెలిక్యాప్ల‌ర్లు భారతీయ సైన్యం తరఫున విన్యాసాలు చేయనున్నాయి.