రేషన్‌ వాహనాలపై పార్టీ నేతల చిత్రాలు, గుర్తులు నిషేధం 

ఎపిలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా రేషన్‌ పంపణీ వాహనాలపై పార్టీ నేతల చిత్రాలు, గుర్తులు ఉంచరాదని హైకోర్టు ఆదేశించింది. ఫిబ్రవరి 1 నుండి ఇంటింటికీ రేషన్‌ పంపిణీ చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. 

అయితే..ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో పంపిణీకి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికల నిబంధనావళికి లోబడే పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

మొత్తం వివరాలను రెండు రోజుల్లో ఎస్‌ఈసికి తెలియజేయాలని, ప్రజోపయోగ కార్యక్రమం కనుక.. దీనిపై ఎస్‌ఈసి 5 రోజుల్లో తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు  నేడు ముగిసాయి.  తొలివిడత ఎన్నికలు జరిగే 168 మండలాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల నామినేషన్ల పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఫలితాల అనంతరం ఉపసర్పంచ్‌ల ఎన్నిక నిర్వహిస్తారు.