సీబీఐకి మాజీ సీఎం ఊమెన్‌ చాందీపై లైంగిక వేధింపు కేసు 

కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారిక ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీతోపాటు పార్టీలోని ఇతర నేతలపై నమోదైన లైంగిక దాడి కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.  2016, 2018, 2019లలో నమోదైన అయిదు కేసులను ప్రభుత్వం సీబీఐకు అప్పజెప్పనున్నట్లు రాష్ట్ర హోమ్ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. 

 ఉండగా కేరళలో గత యూడీఎఫ్‌ ప్రభుత్వంలో వెలుగు చూసిన సోలార్‌ ప్యానెల్‌ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సరితా నాయర్  2012లో వీరందరూ తనను లైంగికంగా వేధించారని గతంలో ఫిర్యాదు చేశారు. చాందీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్‌, కాంగ్రెస్‌ ఎంపీలు హిబి ఎడెన్‌, అదూర్‌ ప్రకాశ్‌, మాజీ మంత్రి ఏపీ అనిల్‌ కుమార్‌, ఏపీ అబ్దుల్‌కుట్టి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని సరితా ఆరోపించారు. 

అయితే  అప్పటి కాంగ్రెస్‌ నేత జోస్‌ కే మణిపై కూడా ఆరోపణలు చేసినప్పటికీ అతను అనంతరం ఎల్డీఎఫ్‌లో చేరడంతో తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.   సోలార్‌ స్కాంపై దర్యాప్తు చేసిన జ్యుడిషియల్ కమిషన్ 2017లో చాందీ, వేణుగోపాల్‌తోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని సిఫారసు చేసింది.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాందీ, ఇతరులు తనను లైంగికంగా వేధించారని, సోలార్‌ సంస్థ ద్వారా అక్రమంగా లాభార్జన పొందటానికి అనుమంతించారని నిందితురాలు కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొంది. దీంతో వీరందరిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సీపీఎం ప్రభుత్వం ఆదేశించింది.

అయితే  చాందీ హైకోర్టును ఆశ్రయించి అతనిపై ఉన్న కేసును రద్దు చేసుకున్నాడు. తర్వాత మహిళ కాంగ్రెస్‌ నాయకులపై కొత్తగా ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు. అంతేగాక ఈ కేసులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇటీవల ఆమె ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను సంప్రదించారు.

దీనిపై స్పందించిన చాందీ తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కాగా కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న చర్యని కాంగ్రెస్‌ తప్పుపట్టింది.తమ పార్టీ నేతలపై ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడటంతో తమను ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టింది. మరోవైపు మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం సీబీఐకి ఈ కేసులను అప్పగిస్తోందని బిజెపి నేత, కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్‌ ఆరోపించారు.