కొవాగ్జిన్‌’ సురక్షితమైనదే…  ‘లాన్సెట్‌’ అధ్యయనం

కరోనా కట్టడికి దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ ‘కొవాగ్జిన్‌’ సురక్షితమైనదేనని అంతర్జాతీయ వైద్య జర్నల్‌ ‘లాన్సెట్‌’లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. టీకా వేసుకున్న వలంటీర్లు సమర్థంగా వైరస్‌ను తట్టుకున్నారని ఆ అధ్యయనం పేర్కొంది. 

ఈ మేరకు ‘కొవాగ్జిన్‌’ తొలిదశ ట్రయల్స్‌ ఫలితాలపై నిర్వహించిన అధ్యయనం వివరాలను ‘లాన్సెట్‌’ ప్రచురించింది. టీకా వల్ల వలంటీర్లలో రోగనిరోధక శక్తి మెరుగైందని, కొందరిలో మాత్రం స్వల్ప స్థాయిలో దుష్ప్రభావాలు తలెత్తినట్లు తెలిపింది. ప్రతికూల ప్రభావానికి సంబంధించి ఒక కేసు నమోదైనప్పటికీ.. దానికి టీకా కారణం కాదని నిర్ధారణ అయినట్లు పేర్కొంది. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ)-పుణె సహకారంతో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ‘కొవాగ్జిన్‌’ టీకాను  అభివృద్ధి చేసింది. 

కాగా ‘కొవాగ్జిన్‌’ టీకా అత్యవసర వినియోగానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడో దశ ట్రయల్స్‌ జరుగుతుండగా అత్యవసర వినియోగానికి ఎలా అనుమతులు మంజూరు చేస్తారని పలువురు విమర్శించారు. ఈ క్రమంలో టీకా సురక్షితత్వంపై ‘లాన్సెట్‌’ ప్రకటన వెలువడటం గమనార్హం.

‘లాన్సెట్‌’లో తమ వ్యాక్సిన్‌ తొలిదశ ట్రయల్స్‌ అధ్యయన ఫలితాలు ప్రచురితమవటం పట్ల భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల పట్ల ఎంతో గర్వపడుతున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా 13వేల మంది వలంటీర్లకు రెండో డోసు అందించినట్లు వెల్లడించారు. 

 కాగా, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ)లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం జరిగిందని ఆ సంస్థ సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ అగ్నిప్రమాదం  వల్ల కరోనా టీకా కోవిషీల్డ్‌ ఉత్పత్తి, సరఫరాపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. 

భవిష్యత్తులో ఉత్పత్తి చేసే బీసీజీ టీకా కోసం నిర్మాణం జరుగుతున్న భవనంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన భవనానికి దూరంగా కరోనా టీకా ఉత్పత్తి జరుగుతున్నదని, దీంతో వ్యాక్సిన్లకు ఎలాంటి నష్టం లేదన్నారు. అగ్నిప్రమాదం వల్ల వెయ్యి కోట్లకుపైగా ఆర్థిక నష్టం జరిగిందని అదార్‌ వివరించారు.

ఇలా ఉండగా, లక్ష్మణుడి ప్రాణాలు కాపాడటానికి హనుమంతుడు ద్రోణగిరి పర్వతం నుంచి సంజీవని తెచ్చాడు. భారతదేశం బ్రెజిల్‌కు కరోనా టీకాలు పంపించడంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో రామాయణంలోని ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ.. హనుమంతుడు కరోనా టీకాను భారత్‌ నుంచి బ్రెజిల్‌కు తీసుకువెళ్తున్నట్టుగా ఉన్న చిత్రాన్ని ట్వీట్‌ చేశారు.