బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని కనుమరుగు చేస్తాం

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీని కనుమరుగు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. సిలిగురిలోని జల్‌పాయ్‌గురి రైల్వే జంక్షన్‌లో మంగళవారంనాడు జరిగిన ర్యాలీలీ ప్రసంగించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ టీఎంసీ పాలనలో హింసాత్మక రాజకీయాలు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు. 
 
బీజేపీని అడ్డుకునే ఎత్తుగడలు వేసిన ప్రతిసారి ఆ పార్టీ బలహీన పడుతూ వస్తోందని ఎద్దేవా చేశారు. బీజేపీతోనే పశ్చిమబెంగాల్‌లో మార్పు సాధ్యమని స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీని దాదాపు సగానికి సగం తగ్గించామని, 2021 ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా కనుమరుగు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
 
 కాగా, కోల్‌కతాలో మంగళవారం ఉదయం జరిగిన బీజేపీ ర్యాలీపై కొందరు రాళ్లు రువ్విన ఘటన చోటుచేసుకుంది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, దిలీప్ ఘోష్, బీజేపీ నేత సువేందు అధికారి తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.