నెల్లూరు  ఎస్పీకి వైసిపి ఎమ్యెల్యే హెచ్చరిక!  

నెల్లూరు ఎస్పీ పై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. డిసిఎంఎస్‌ చైర్మన్‌ పై అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కేసులు పెట్టొద్దని అధికారులకు ఎస్పీ ఫోన్‌ చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఓ సభలో ” ఎవరు నువ్వు.. ఎక్కడి నుండి వచ్చావ్‌.. ఎవడు నీకు రూల్స్‌ నేర్పింది.. ఎన్నాళ్లు ఉంటావ్‌.. నిన్ను డిజిపి కాపాడతాడనుకుంటున్నావా ?.. ” అంటూ నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ రెడ్డి మండిపడ్డారు.
 
జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ టార్గెట్‌ గా చేసిన వ్యాఖ్యలే చేశారనడం బహిరంగ రహస్యమే. ” నువ్వు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్‌వా ? మా ప్రభుత్వం తరుపున ఈ జిల్లా అధికారిగా వచ్చిన వ్యక్తివా ? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఓ మాజీ మంత్రి ఫోన్‌ చేస్తే నువ్వు మావాళ్లకు ఫోన్‌ చేసి కేసు రిజిస్ట్రర్‌ చేయొద్దని చెప్పడమేంటి ? ఎన్ని రోజులుంటావ్‌ నువ్వు నెల్లూరు జిల్లాలో.. రెండు రోజులో.. మూడు రోజులో.. తర్వాత నీ బతుకేంది.. వేరే జిల్లాకు పోతావ్‌.. ”  అంటూ బహిరంగంగా హెచ్చరించారు. 
 
ఎస్సీ, ఎస్టీ కేసు రిజిస్ట్రర్‌ చేయొద్దు అని చెప్పడానికి నీకేం రూల్స్‌ ఉన్నాయి? ఏ జిల్లాలోనూ ఇలా జరగడం లేదే.. నెల్లూరు జిల్లాలోనూ ఇంతకుముందు ఇలా జరగలేదు. ఎస్సీ, ఎస్టీ కేసు రిజిస్ట్రర్‌ చేసేవాళ్లు.. ఎంక్వయిరీ చేసేవాళ్లు.. దాంట్లో ఏవిధంగా ఉంటే ఆ విధంగా ఫైనల్‌ యాక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ తీసుకుంటుందని అంటూ స్పష్టం చేశారు. 
 
నీ క్రింది అధికారులను కేసు నమోదు చేస్తే  వారిని జైళ్లలో వేయిస్తానని బెదిరిస్తావా ? నీకుందా దమ్ము .. నేను నిలబడతాను నావాళ్ల పక్కన.. రా నీకు దమ్ముంటే ఆ ముగ్గురిని అరెస్టు చేయించు.. న్యాయం పక్కన నేనుంటా.. నీలాగా పిచ్చి వ్యవహారాలు నేను చేయను. ఏం భయం నీకు తెలుగుదేశం వాళ్లు నీకు ఫోన్‌ చేస్తే నువ్వేంది బెదిరిపోయేది”  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
పైగా, ఇక్కడ ఎవ్వరి ప్రభుత్వం  అనుకుంటున్నావ్‌.. జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను ఆ జిల్లా అధికారికి.. మాతో పెట్టుకోవద్దు అని చెబుతున్నాను అంటూ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ స్పష్టం చేశారు.   ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ మాటలను బట్టి తెలుస్తోంది ఏంటంటే.. కొందరు టిడిపి వ్యక్తులు డిసిఎంఎస్‌ చైర్మన్‌ చలపతిరావుపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు చేశారు. పోస్టులు పెట్టింది టిడిపి నేతలేనని వైసిపి ఆరోపణ. 
 
పోస్టులు పెట్టినవారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలన్నది డిమాండ్‌. ఆ కేసులు పెట్టద్దు అని ఎవరో టిడిపి నేత జిల్లా ఎస్పీ కి ఫోన్‌ చేశారన్నది ప్రసన్నకుమార్‌ చెబుతోన్న మాట. టిడిపికి చెందిన నేత చెబితే నువ్వు కేసులు పెట్టకుండా ఉంటావా అంటూ.. ప్రసన్నకుమార్‌ మండిపడ్డారు.