దేవాలయాలపై దాడుల వెనుక జగన్ బావ బ్రదర్ అనిల్!

ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవత విగ్రహాల విధ్వంసం వెనుక ఉన్నది ప్రతిపక్షాన్ని అంటూ ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, డిజిపి గౌతమ్  నేతలు, మంత్రులు   చేస్తుండగా ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి కుటుంభం పైననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన కాకినాడ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ముఖ్యమంత్రి బావ బ్రదర్ అనిల్ కు సన్నిహితుడని కధనాలు వెలువడుతూ ఉండడంతో అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టివేసి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 
 
ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సహితం రాష్ట్రంలో పెద్ద  ఎత్తున మతమార్పిడులను ప్రోత్సహించడంలో బ్రదర్ అనిల్ క్రియాశీల పాత్ర వహించారని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. తిరిగి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆ కార్యకలాపాలను పునరుద్దరించినట్లు హిందూ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో వరుసగా దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక వ్యవస్థీకృత కుట్ర దాగి ఉన్నట్లు భావించవలసి వస్తున్నది. 
 
రాష్ట్రంలో దేవాలయంపై జరుగుతున్న దాడులను పరిశీలిస్తే ఒకే రకమైన ఆయుధాలు ఉపయోగించినట్లు కనిపిస్తున్నదని ఉన్నత పోలీస్ అధికారులు సహితం పేర్కొనడం ఈ సందర్భంగాగమనార్హం . ప్రవీణ్ చక్రవర్తి ఇతర మతాలను కించపరిచేలా యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా,  తానే విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నిచోట్ల విగ్రహాలను కాలితో తన్నానంటూ వైరల్ అవుతున్న ఒక వీడియోలో పేర్కొన్నాడు. 
 
ఏడాది క్రితం పోస్టైన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అభియోగాలతో ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ వెల్లడించారు. 
 
ప్రవీణ్ చక్రవర్తికి సీఎం జగన్ బావ అయిన బ్రదర్ అనిల్‌తో సంబంధాలు ఉన్నాయని మాజీ హోమ్ మంత్రి, టిడిపి నేత చిన రాజప్ప ఆరోపించారు. అవి ఏ సంబంధాలో చెప్పాలని ఆయన డిజిపిని నిలదీశారు. పైగా, తూర్పు  గోదావరి జిల్లాల్లో అతనికి అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో సన్నిహిత  సంబంధాలు ఉన్నాయని కూడా చెబతున్నారు.
 
నేరుగా ముఖ్యమంత్రి కుటుంభం సభ్యులపైనే ఆరోపణలు వస్తూ ఉండడంతో రాష్ట్ర డిజిపి దేవాలయాలపై జరుగుతున్న దాడులపై విచారణకు ఏర్పాటు చేసిన  సిట్ వల్లన ప్రయోజనం ఉండబోదని రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. లోతయిన దర్యాప్తు జరగాలి అన్నా, అసలు నిందితులను పట్టుకోవాలి అన్నా సిబిఐ లేదా మరో కేంద్ర సంస్థతో దర్యాప్తు జరపాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.