భారత్లో కరోనా వ్యాక్సినేషన్కు కోవిషీల్డ్, కోవాగ్జిన్కు మాత్రమే పరిమిత వినియోగంపై అనుమతులు లభించాయి. కోవిషీల్డ్ తీసుకునేవారికి సాధారణంగానే వ్యాక్సిన్ వేస్తారు. కానీ, కోవాగ్జిన్ తీసుకోవాలంటే మాత్రం అంగీకారపత్రంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. షరతులు, నిబంధనలు ఈ పత్రంలో ఉంటాయి.
ఒకవేళ కోవాగ్జిన్ తీసుకున్న తర్వాత సదరు వ్యక్తిలో ఆరోగ్యపరంగా ఏమైనా ప్రతికూల పరిస్థితులు కనిపించినా, అందుకు ఆ వ్యాక్సినే కారణమని తేలినా సదరు వ్యక్తికి వైద్య ఖర్చును భరించడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా భారత్ బయోటెక్ చెల్లిస్తుంది. ఈ పరిహారాన్ని ఐసిఎంఆర్కు చెందిన సెంట్రల్ ఎథిక్స్ కమిటీ నిర్ణయిస్తుంది.
కోవాగ్జిన్ తీసుకున్నవారికి ఓ ఫ్యాక్ట్ షీట్ను, దుష్ఫలితాలను తెలియజేసే ఓ ఫారాన్ని ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న నాటి నుండి ఒక వారం పాటు ఆరోగ్యపరంగా ఎదురైన పరిస్థితులను ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పి, అలర్జీ, మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినపుడు ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది.
కాగా, కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసుకుా రెండో డోసుకు మధ్య 6 లేదా 8 వారాల విరామం ఉత్తమమని సీరమ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ తెలిపారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకునే డోసుల మధ్య 28 రోజులకుపైగా విరామం ఉన్న పక్షంలో దీని సామర్థ్యం పెరుగుతుందని సీరమ్ సంస్థ సిఇఒ ఆదార్ పూనావాలా తెలిపారు.
ఈ విషయమై సురేష్ జాదవ్ మాట్లాడుతూ.. కొన్ని వారాల పాటు ఈ గ్యాప్ పెరిగితే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. నాలుగు వారాల గ్యాప్ ఉన్నా మంచిదేనని, లేదా 6 లేక 8 లేదా 10 వారాలు విరామం మరీ మంచిదని వివరించారు. ఫేజ్-3లో క్లినికల్ ట్రయల్స్ను 28 రోజుల గ్యాప్తో నిర్వహించామన్నారు. రెండు డోసులు త్వరగా తీసుకుంటే దీన్ని తీసుకున్నవారికి 70 శాతం ప్రొటెక్షన్ ఉంటుందని, ఎక్కువకాలం రక్షణ పొందాలనుకుంటే 6 నుంచి 8 వారాల తరువాత మరో డోసు తీసుకుంటే ఇంకా మంచిదని పేర్కొన్నారు.
కరోనా నుంచి కోలుకున్నవారు కూడా వాక్సిన్ తీసుకోవలసిందేనని తెలిపారు. కొందరికి రెండుసార్లు ఈ మహమ్మారి సంక్రమించడమే ఇందుకు కారణమన్నారు. రెండు టీకా మందులనూ మిశ్రమం చేయరాదని, ప్రతి డోసు డిఫరెంట్ వ్యాక్సిన్ నుంచి వచ్చిందని తెలిపారు.
More Stories
నటి తమన్నా భాటియాకు సైబర్ క్రైమ్ పోలీసుల నోటిస్
ఢిల్లీ లిక్కర్ కేసులో క్విడ్ ప్రోకో
కోటక్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు