నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ కింద రూ.1000 కోట్ల నిధిని కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. దీనివల్ల దేశంలో కొత్త స్టార్టప్లు పెరుగడానికి దోహద పడుతుందని చెబుతూ సరికొత్త జాతీయ స్టార్టప్ విధానాన్ని వెల్లడించారు.
భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన స్టార్టప్ సంస్థల వ్యవస్థాపకులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ దేశీయ యువకుల కోసం యువతతోనే స్టార్టప్ వ్యవస్థను సృష్టిస్తున్నట్లు మోదీ చెప్పారు. సమాజ భవితవ్యం మార్పులకు మార్గదర్శకులని స్టార్టప్ వ్యవస్థాపకులను పొగడ్తల్లో ముంచెత్తారు.
ఇంతకుముందు స్టార్టప్ నిర్వాహకులను మీరెందుకు ఉద్యోగం చేయడం లేదని ప్రశ్నించడం విన్నానని, కానీ ఇప్పుడదే ప్రజానీకం ఉద్యోగం చేయడానికి బదులు ఒక స్టార్టప్ ఎందుకు సృష్టించకూడదని ప్రశ్నిస్తున్నారని ప్రధాని తెలిపారు. ఇది డిజిటల్ విప్లవతరం, న్యూ ఏజ్ ఇన్నోవేషన్ అని పేర్కొన్న ప్రధాని నరేంద్రమోదీ ఆసియా దేశాల నుంచే భవిష్యత్ పారిశ్రామికవేత్తల కోసం డిమాండ్ చేసే సమయం రానున్నదని పేర్కొన్నారు.
ఆసియా ల్యాబోరేటరీల నుంచే భవిష్యత్ టెక్నాలజీలు వస్తాయని చెబుతూ స్టార్టప్లు బిజినెస్ డెమోగ్రాఫిక్ క్యారెక్టర్నే మార్చేస్తున్నాయని ప్రధాని తెలిపారు. ప్రపంచంలోకెల్లా భారత్లోనే అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టం ఉందని ప్రధాని మోదీ చెప్పారు. 41 వేలకు పైగా దేశంలో స్టార్టప్లు పని చేస్తున్నాయని, వాటిలో 5,700 స్టార్టప్లు ఐటీ రంగంలో, 3,600 ఆరోగ్య రంగంలో, 1700 స్టార్టప్లు వ్యవసాయ రంగంలో సేవలందిస్తున్నాయని వివరించారు.
More Stories
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ప్రాణహాని ఉందని జెడి లక్ష్మీనారాయణ ఫిర్యాదు
ఇవిఎంలపై పిటిషన్లు 40 సార్లు తిరస్కృతి