రాష్ట్రపతి నుండి రామాలయంకు మొదటి విరాళం 

అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌  నేడు ప్రారంభిస్తున్నది. ఇందులో భాగంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రతినిధుల బృందంలోని సభ్యులైన కోశాధికారి గోస్వామి కోవింద్‌ దేవ్‌గిరి మహరాజ్‌, వీహెచ్‌పీ కార్యనిర్వహక అధ్యక్షుడు అలోక్‌కుమార్‌, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ మిశ్రా, ఢిల్లీ ఆర్‌ఎస్‌ఎస్ నేత   కుల్‌భూషన్‌ అహుజా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి మొదటి విరాళం స్వీకరించనున్నారు. 

ఇటీవల కాలంలో రాష్ట్రపతి నుంచి విరాళాలు సేకరించడం ఇదే తొలిసారి. అలాగే ప్రధాని ప్రతినిధుల బృందం నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడులను కూడా కలిసి విరాళాల సేకరించనున్నారు. నిధుల సేకరణ శుక్రవారం ప్రారంభమై  వచ్చే నెల 27వ తేదీ వరకు, 44 రోజుల పాటు  సాగనుంది. నిధుల సేకరణ కోసం దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రముఖ వ్యక్తులతో కమిటీలను ఏర్పాటు చేశారు.

అదే సమయంలో పట్టణాలు, గ్రామాల్లోనూ కమిటీలను నియమించారు. నిధుల సేకరణలో భాగంగా దేశవ్యాప్తంగా 13 కోట్ల కుటుంబాలకు చెందిన 65 కోట్ల మందిని రామభక్తులు కలువనున్నారు. వీహెచ్‌పీ నేతృత్వంలో జరిగే ప్రచారంలో 40 లక్షల మంది పాలు పంచుకోనున్నారు. నిధుల సేకరణ, ప్రచారం కోసం దేశవ్యాప్తంగా 5.25 లక్షల గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసినట్లు అలోక్ కుమార్ తెలిపారు. 

అన్ని బృందాల్లో ఐదు నుంచి ఏడుగురు వ్యక్తులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ప్రతి ఐదు పంచాయతీలపై ఓ ఫండ్‌ డిపాజిటర్‌ ఉండనున్నారు. వారంతా సేకరించిన మొత్తాన్ని ఏ రోజుకారోజు బ్యాంకులో జమ చేయనున్నారు. ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, నయా ఘాట్ శాఖలతో అయోధ్యలో ఖాతాలు ప్రారంభించారు. కమిటీలన్ని సాధారణ నుంచి ఉన్నత వర్గాలకు చెందిన ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నారు.

విరాళాలు ఇచ్చిన వారందరికీ రశీదులు ఇవ్వనున్నారు. రూ.10 చందా కోసం నాలుగు కోట్ల రశీదులు, రూ.100 విరాళం కోసం 8 కోట్లు, రూ.వెయ్యి విరాళానికి 12లక్షల రశీదులను ట్రస్ట్‌ ముద్రించింది. రూ.వేలు మించి ఇచ్చే వారికి రశీదులు ఇవ్వనున్నారు. 

నిధుల సేకరణలో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా చూడాలని ట్రస్ట్ నిర్వహించింది. ప్రజలు ఆన్‌లైన్‌లోనూ విరాళాలు ఇవ్వొచ్చని కమిటీ తెలుపొంది. ఎప్పటికప్పుడు సేకరించిన మొత్తాన్ని లెక్కించనున్నారు. బృందాలన్నీ ట్రస్ట్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా పని చేయనున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు సైతం కీలకపాత్ర పోషించనున్నారు.