మరోసారి రైతులతో అసంపూర్ణంగా చర్చలు 

కేంద్రం, రైతు ప్రతినిధుల మధ్య జరిగిన తొమ్మిదో విడత చర్చలు కూడా అసంపూర్తిగా ముగిసాయి. సమావేశంలో ఎలాంటి అవగాహన కుదరలేదని, ఈనెల 19న తాము మరోసారి తాము చర్చలు జరుపుతామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. 

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు ప్రతినిధులు మరోసారి పట్టుబట్టడం, ఇందుకు కేంద్రం అంగీకరించకపోవడంతో శుక్రవారం చర్చలు సైతం అసంపూర్తిగానే ముగిసాయి. అనంతరం మంత్రి తోమర్ మీడియాతో మాట్లాడుతూ, చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనేందుకు తాము పాజిటివ్‌గా ఉన్నామని చెప్పారు.

 చలిగాలిల్లో రైతులు నిరసనలు సాగిస్తుండటంపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి, ప్రభుత్వం తమ వాదన వినిపిస్తుందని చెప్పారు.

కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటనలు, చర్యలు చూసి సొంత పార్టీ వాళ్లే నవ్వుకుంటున్నారని తోమర్ ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ చట్టాలను తీసుకువస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీని మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. రాహుల్‌కు గుర్తులేకుంటే ఆయన మరోసారి మేనిఫెస్టో చదువుకోవాలని తోమర్ సూచించారు.

చట్టాల్లోని అంశాల వారీగా మాట్లాడదామని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్తుంటే.. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, కనీస మద్ధతు ధరపై చట్టబద్ధ హామీ ఇవ్వడం మినహా మరే డిమాండ్‌ను ఒప్పుకోమని, మరే అంశమూ చర్చించబోమని రైతులు తేల్చి చెప్తున్నారు.