రామతీర్థ పోరాట కమిటీని ఏర్పాటు చేసిన పవన్ 

విజయనగరం జిల్లా రామతీర్థంలో కలకలం రేపిన  రాముడి విగ్రహానికి శిరచ్ఛేదన ఘటనపై రామతీర్థ పోరాట కమిటీని జనసేన ఆద్యషుడు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కమిటీ సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డిపల్లి రఘుని నియమించారు.
రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గుడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని ఈ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎలాంటి కఠినమైన కేసులనైనా గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెపుతుంటారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని విమర్శించారు. ఈ కేసులో సత్వర న్యాయం జరిగేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలిసి ఈ కమిటీ పని చేస్తుందని చెప్పింది. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుందని తెలిపింది.