ట్విట్టర్‌లో మేటి ప్రధాని మోదీ

ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోదీయే అగ్రగామిగా ఉన్నారు. ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీ ఎప్పుడూ క్రియాశీలకంగానే ఉంటారు. తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా మాధ్యమంగా పోస్ట్ చేస్తూనే ఉంటారు. 
 
ప్రస్తుతానికి ట్విట్టర్‌లో మోదీని 64.7 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.   అయితే మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు ట్రంపే టాప్. అతడిని 88.7 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. కానీ వాషింగ్టన్‌లో తలెత్తిన పరిణామాల తర్వాత ట్విట్టర్ ఆయన అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించింది. దీంతో ప్రధాని మోదీ ముందువరసలో చేరారు. 
 
అమెరికా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన జోబైడెన్‌ను 23.3 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇక మన భారత్ విషయానికి వస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 24.2 మిలియన్ మంది ఫాలో అవుతుండగా, ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్ కేజ్రీవాల్‌ను 21.2 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. 
 
అయితే రాజకీయంగా క్రియాశీలకంగా లేని నేతల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాయే టాప్‌లో ఉన్నారు. ట్విట్టర్ వేదికగా ఒబామాను 127.9 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.