
రాష్ట్రంలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై సిట్ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ నుంచి సిట్కు విచారణ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. 16 మందితో సిట్ ఏర్పాటు చేసింది.
ఎసిబి అడిషనల్ డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కృష్ణాజిల్లా ఎస్పీ రవీంధ్రనాథ్ బాబుతోపాటు 16 మంది సభ్యులు ఈ సిట్ లో ఉండనున్నారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీ లు, ఇద్దరు ఏసీపీ లు, నలుగురు సీఐ లు, నలుగురు ఎస్సై లతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు కానుంది.
అన్ని జిల్లాల ఎస్పీలు ఈ బృందానికి సహకరించాలని, సీఐడీ, ఇంటెలిజెన్స్ బృందాలు కూడా సిట్ బృందానికి సహకరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. కేసుల తీవ్రత దృష్ట్యా సైబర్ క్రైమ్ విజయవాడ, విశాఖపట్నం బృందాలు సిట్ బృందానికి సహకరించాలని, సిట్ బృందం ఎప్పటికప్పుడు కేస్ దర్యాప్తు పురోగతిని శాంతిభద్రతల అడిషనల్ డీజీకి వివరించాలని పేర్కొంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆలయాలపై దాడులకు సంబంధించి అన్ని కేసులను సిట్ విచారించనుంది. రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే
More Stories
ఎసిబి న్యాయమూర్తిపై ట్రోలింగ్ …విచారణకు ఆదేశించిన రాష్ట్రపతి
నేడు ఏపీ సిఐడి కస్టడీకి చంద్రబాబు నాయుడు
కళాజాతాల కోసం కళాకారుల నుండి దరఖాస్తుల ఆహ్వానం