ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు… నిమ్మగడ్డ ప్రకటన 

ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్  నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు. ఆ మేరకు  స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 23, తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

కరోనా, వ్యాక్సిన్ పరిస్థితులను ఎస్‌ఈసీ నిశితంగా గమనించిందని పేర్కొంటూ ప్రభుత్వ పథకాలు ప్రారంభించే ముందు ఎస్‌ఈసీ అనుమతి తీసుకోవాలన్న   సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదని రమేష్ కుమార్ తప్పుబట్టారు. కరోనా సెకండ్ వేవ్ సాకుతో ప్రభుత్వం ఎన్నికలు వాయిదా వేయాలంటోందని చెప్పారు.

అయితే రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని కొట్టిపారేశారు. భయానక పరిస్థితులున్న అమెరికాలోనే ఎన్నికలు జరిగాయని ఎస్‌ఈసీ రమేష్‌ గుర్తుచేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్న  రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై సుప్రీం కోర్ట్ కు వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. 

 కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు ఇచ్చిన సమాధానంలో రాజకీయం కనబడుతోందని ఆంధ్ర ప్రదేశ్  ఎన్నికల కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొన్న అంశాలన్నీ గతం నుంచి చెబుతున్నవేనని, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ నేత తిరుపతి ఉపఎన్నిక తర్వాతే.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న విషయాన్ని ఎస్‌ఈసీ లేఖలో గుర్తుచేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను తన హయాంలో నిర్వహించకూడదని, తన పదవీ విరమణ తర్వాత నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రకటలన్నీ అందుకనుగుణంగానే ఉన్నాయని చెప్పారు. అయితే  పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశామని, కమిషన్ సూచనను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని భావిస్తున్నామని ఎస్‌ఈసీ లేఖలో తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ వ్రాసారు.

 కరోనా స్ట్రెయిన్‌ వేవ్‌ రావడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కనీసం నాలుగు నెలలు జరిగే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పుడు సాధ్యం కాదని అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు స్పష్టం చేశారు. 

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయనతో పాటు పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు శుక్రవారం సాయంత్రం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కలిశారు. ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. 

అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని ఎస్‌ఇసి చెప్పారు. ప్రస్తుతం కరోనా స్ట్రెయిన్‌ రెండోవేవ్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందని, కేంద్రం కూడా అనేక సూచనలు చేసిందని అధికారులు వివరించారు. 

అలాగే కోవిడ్‌ నివారణకు సంబంధించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతమైందని, దీనిలో భాగంగానే డ్రైరన్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని కమిషనర్‌ సూచించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు.

 దీనిపై తాము నిర్ణయం చెప్పలేమని, రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాత తమ అభిప్రాయం చెబుతామని అధికారులు కమిషనర్‌కు తెలిపారు.