మంత్రి అజయ్‌ను జైలుకి పంపిస్తాం

భూకబ్జాల కోసమే ఎర్రజెండా వదిలి టీఆర్‌ఎస్‌లో చేరిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను జైలుకు పంపిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.  మెడికల్ కాలేజీ పేరుతో భూములు దోచుకున్న సంగతి ప్రజలకు తెలుసునని చెప్పారు. మంత్రి అజయ్ భూకబ్జాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌తో కలిసి బండి సంజయ్‌ శుక్రవారం ఖమ్మంలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం కార్పొరేషన్‌లో కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని ప్రకటించారు. బీజేపీని విమర్శించడానికి మంత్రికి సిగ్గుండాలంటూ ఆయన మండిపడ్డారు. ‘‘నీ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసు.. అక్రమ భూములను రెగ్యులర్ చేయించుకోవడానికి టీఆర్ఎస్‌లోకి చేరారు. మెడికల్ కాలేజీ పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన అక్రమాలన్ని బయట పెడతాం” అని వెల్లడించారు.

నాలుగేళ్లలో నాలుగు పార్టీలు మారిన మంత్రి పువ్వాడ తమకు నీతులు చెప్పుతారా అంటూ నిప్పులు చెరిగారు.   టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో అధికార చేపడతామని, టీఆర్ఎస్ నాయకుల ఆగడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రి అజయ్‌కు కొమ్ముకాసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని సంజయ్ హితవు చెప్పారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలన పాలన పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు కనిపించడం లేదని సంజయ్ చెప్పారు. ఎప్పుడు ప్రభుత్వం పడి పోతుందో తెలియదని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లు కొనసాగడం కష్టమే అని తెలిపారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌పై కరోనా వ్యాక్సిన్ ప్రయోగించామని చెబుతూ  రెండు చోట్ల విజయవంతం అయిందని తెలిపారు.

తర్వాత ఖమ్మం కార్పొరేషన్‌లో వ్యాక్సిన్ ప్రయోగించ బోతున్నామని సంజయ్ ప్రకటించారు. తెలంగాణలో మంత్రులందరూ డమ్మిలేనంటూ’’ బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.