ఎనిమిదో దఫా చర్చల్లోనూ కనిపించని పురోగతి   

నూతన వ్యవసాయ చట్టాల గురించి ఆందోళన చేస్తున్న రైతు ప్రతినిధులతో కేంద్రం జరిపిన ఎనిమిదో దఫా చర్చలలో సహితం ఎటువంటి పురోగతి కనిపించలేదు.  ఈనెల 15న మరోసారి సమావేశం కావాలని మాత్రం నిర్ణయించారు. విజ్ఞాన్ భవన్‌లో సుమారు గంటసేపు చర్చలు జరిగినప్పటికీ ఇరువర్గాలు తమ వాదనకే కట్టుబడ్డాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. చట్టాలను వెనక్కితీసుకుంటేనే తాము నిరసనలకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్తామని చెప్పారు. 

మరోవైపు, ప్రభుత్వం కూడా తమ వైఖరి మరోమారు స్పష్టం చేసింది.  వివాదాస్పద క్లాజులకే చర్చలు పరిమితం చేద్దామని, చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకునేది లేదని తెగేసి చెప్పింది. శుక్రవారం జరిగిన  చర్చల్లో రైతుల తరపున 40 మంది రైతు నేతలు పాల్గనగా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో పాటు రైల్వే, వాణిజ్య, ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, పంజాబ్‌ ఎంపి, వాణిజ్య శాఖ సహాయక మంత్రి సోమ్‌ ప్రకాష్‌లు  విజ్ఞాన్‌ భవన్‌లో సమావేశమయ్యారు.

చర్చల్లో ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూ, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్దఎత్తున వ్యవసాయ సంస్కరణ చట్టాలను స్వాగతిస్తున్నారని, యావత్ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే యూనియన్లు ఆలోచించాలని కోరింది.   పంజాబ్‌ హర్యానా రాష్ట్రాలకు మాత్రమే ఈచట్టాలు తీసుకురాలేదని, దేశవ్యాప్తంగా ఈ చట్టాలను అమలుచేస్తామని కేంద్ర మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

రాష్ట్రాలు తమ సొంత చట్టాలను అమలుచేసేందుకు అవకాశాన్ని కల్గిఉండేందుకే కొత్త చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారని వారు ఆరోపించారు. చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ జనవరి 15న జరిగే తదుపరి చర్చలకు హాజరవుతాయని రైతు నేతలు ప్రకటించారు.

ఈ చట్టాలను రద్దు చేయకపోతే జనవరి 26 రిపబ్లిక్‌ డే రోజున ట్రాక్టర్‌ పరేడ్‌ నిర్వహిస్తామని రైతులు ప్రకటించారు. ఈ పరేడ్‌కు ట్రైలర్‌గా గురువారం ఢిల్లీలో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహించిన నిర్వహించారు.