భద్రతా మండలి తాత్కాలిక సభ్యునిగా భారత్  

భద్రతా మండలి తాత్కాలిక సభ్యులుగా భారత్‌తో పాటు ఐర్లాండ్‌, కెన్యా, మెక్సికో, నార్వేలు సోమవారం తమ బాధ్యతలు చేపట్టాయి. రెండేళ్ళ వారి పదవీకాలం అధికారికంగా జనవరి 1 నుండి ప్రారంభమైంది. కానీ, క్రిస్మన్‌, నూతన సంవత్సరం సెలవులు ముగిసిన తర్వాత మొదటి వర్కింగ్‌ డే అయిన సోమవారం ఈ దేశాలు బాధ్యతలను చేపట్టాయి. 

బాధ్యతలు ప్రారంభమైన దానికి గుర్తుగా ఆయా దేశాల పతాకాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐక్యరాజ్య సమితిలోని కజకస్తాన్‌ రాయబారి మగన్‌ ఇలిసోవ్‌ అధ్యక్షత వహించారు. కొత్తగా సభ్యులైన ఐదు దేశాలను అభినందించారు. ఈ పదవీ కాలంలో తమ ప్రాధాన్యతలేమిటో తెలుసుకుని విజయం సాధించాలని ఆకాంక్షించారు. 

ఆధునిక చరిత్రలో ఈ రెండేళ్లు చాలా కీలకమైనవని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలు, నిలకడగల అభివృద్ధి కొత్త సంవత్సరంలో జరగాలని అందరం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐదు దేశాల ప్రతినిధులు కూడా ప్రసంగించారు. బెల్జియం, డొమినికన్‌ రిపబ్లిక్‌, జర్మనీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా దేశాల స్థానంలో కొత్తగా ఈ ఐదు దేశాలు వచ్చాయి.