రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

రైతుల సంక్షేమానికి  నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులతో ఏడు సార్లు చర్చలు చేసిన ఆయన మరో మారు ఈ నెల 8వ తేదీన జరిగే చర్చల నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

వ్యవసాయ చట్టాలకు అనుకూలంగా ఉన్న రైతులను వ్యతిరేకిస్తున్న రైతులను కలిసి మాట్లాడనున్నట్లు తెలిపారు. ‘‘ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై కొంత మంది ఆందోళన చేస్తున్నారు. నిజానికి మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చేవారిని వ్యతిరేకించే వారిని కలుస్తాం” అని తెలిపారు. 

ప్రస్తుతం ఆందోళన చేస్తున్నవారంతా మరోసారి ఆలోచిస్తారని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.  రైతు సంక్షేమం కోసం వారు పునరాలోచించాలని కోరారు. తొందరలోనే వాళ్లు పరిష్కారానికి వస్తారని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విశ్వాసం వ్యక్తం చేశారు. 

కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించచేందుకు సుప్రీంకోర్టు సంసిద్ధత వ్యక్తం చేసింది. రైతుల గందరగోళంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం అన్ని పిటిషన్లను ఒకే ధర్మాసనానికి బదిలీ చేసి విచారణ చేపట్టనున్నది.