సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు `సుప్రీం’ పచ్చజెండా

నరేంద్ర మోదీ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన సెంట్రల్ విస్టా రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో జస్టిస్‌ ఎ.ఎం. ఖన్విల్కర్‌ ధర్మాసనం ఏకీభవించింది. నిర్మాణ పనుల ప్రారంభానికి హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి తప్పనిసరని మంగళవారంనాడు ఇచ్చిన సంచలన తీర్పులో సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీ నుంచి ప్రాజెక్టు ప్రపొనెంట్లు తప్పనిసరిగా ఆమోదం పొందాల్సి ఉంటుందని ఆదేశాలిచ్చింది.
న్యాయమూర్తులు ఏఎం ఖాన్‌విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ కన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో తీర్పు వెలువరించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం గత ఏడాది 5న తీర్పును రిజర్వ్ చేసి మంగళవారంనాడు తీర్పును వెలువరించింది.
డీడీఏ చట్టం కింద అధికారాల వినియోగం చెల్లుబాటవుతుందని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది.  అలాగే పర్యావరణ అనుమతి సిఫారసులు సరిగానే ఉన్నందున వాటి చెల్లుబాటును ధ్రువీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలోని లుట్యెన్స్ జోన్‌లో కేంద్రం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింది. ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఉన్న ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా నూతన పార్లమెంట్ భవన నిర్మాణం, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం, ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న 3 కిలోమీటర్ల రాజ్‌పథ్‌ పునరుద్దరణ చేపట్టనున్నారు.
కాగా, ప్రాజెక్టు భూ వినియోగంలో చట్ట విరుద్ధమైన మార్పులు, వారసత్వ సంపద పరిరక్షణ నియమాల ఉల్లంఘన, డిజైన్,పర్యావరణ అనుమతులు తదితర అంశాలను లేవనెత్తుతూ సుప్రీం కోర్టులో సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై వేలాది పిటిషన్లు దాఖలయ్యాయి.
దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు తమ వాదనలు వినిపించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్లు ఆదా అవుతుందని, హౌసింగ్ మంత్రిత్వ శాఖకు అద్దె రూపంలో చెల్లిస్తున్న డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటు భవనం వందేళ్ల పాతదని, శిథిలావస్థకు చేరుతోందని వాదించింది.
ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్ 10న ప్రాజెక్టు శంకుస్థాపనకు అనుమతినిచ్చిన సుప్రీం కోర్టు నిర్మాణాలకు మాత్రం బ్రేక్ వేసింది. సుప్రీం తీర్పు వచ్చేంతవరకూ అక్కడ ఎలాంటి నిర్మాణ కార్యకలాపాలు గానీ భవనాల కూల్చివేత గానీ చెట్ల నరికివేత గానీ చేపట్టరాదని ఉత్తర్వులు ఇచ్చింది.