మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోలేమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 41 రైతు సంఘాల నేతలతో సోమవారం నిర్వహించిన ఏడో విడత చర్చల్లో ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తోపాటు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, సోమ్ ప్రకాష్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
వ్యవసాయ చట్టాల్లో పేర్కొన్న ఏదైనా నిబంధనను రైతులు సమస్యగా భావిస్తే దానిపై సమీక్ష చేస్తామని చెప్పారు. రైతుల ప్రయోజనం కోసం తెచ్చిన వ్యవసాయ చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోబోమని పేర్కొన్నారు. ఈ నెల 8న మరో విడత చర్చలను నిర్వహిస్తామని వెల్లడించారు.
ఈ చట్టాలలో అంశాలపై ఒకొక్క క్లాజ్ వారీగా రైతుల అభ్యంతరాలు వినాలని అనుకొంటున్నామని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కనీస మద్దతు ధరపై ప్రాధమికంగా చర్చలు జరిగాయని, అయితే అసంపూర్తిగానే ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్న తీరు గమనిస్తే వచ్చే సమావేశంలో ఒక అంగీకారానికి రాగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతుల ఉద్యమం సందర్భంగా మృతి చెందిన రైతులకు సంతాపం తెలుపుతూ తొలుత మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధులు రెండు నిముషాల సేపు మౌనం పాటించారు. కేంద్ర మంత్రులు గతంలో మాదిరిగా రైతులతో కలిసి భోజనం కూడా చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చల పురోగతిలో మరోసారి ప్రతిష్టంభన నెలకొన్నది.
మరోవైపు వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్నవే తమ రెండు ప్రధాన డిమాండ్లని రైతు నేతలు తెలిపారు. వీటిని పరిష్కరించడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గమని తాము చెప్పినట్లు రైతు నేత జోగిందర్ సింగ్ చెప్పారు. కాగా జనవరి 26 లోగా తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోతే వేలాది మంది రైతులు రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడానికి తమ ట్రాక్టర్లలో రాజధానిలోకి ప్రవేశిస్తారని వ్యవసాయ సంఘాల వేదిక అయిన సంయుక్త్ కిసాన్ మోర్చా మరోసారి హెచ్చరించింది.
More Stories
రాహుల్ గాంధీ `పాకిస్తాన్ అనుచరుడు’
బ్రిజ్ భూషణ్ సింగ్ కు బిజెపి సీట్ నిరాకరణ!
అయోధ్య రామమందిరంలో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు