రూ 8.83 లక్షల కోట్ల రుణాలు రద్దుచేసిన బ్యాంకులు   

భారతీయ బ్యాంకులు గ‌త పదేళ్ల‌లో రూ.8,83,168 కోట్ల రుణాలను ర‌ద్దు (రైట్ ఆఫ్‌) చేసిన‌ట్లు రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఇందులో ప్ర‌భుత్వ రంగ బ్యాంకులే ఏకంగా రూ.6,67,345 కోట్ల రుణాల‌ను ర‌ద్దు చేయ‌డం గ‌మ‌నార్హం.

అంటే 2010 నుంచి ర‌ద్దు చేసిన రుణాల్లో ప్రభుత్వ రంగ  బ్యాంకుల వాటా 76 శాతం. ఇక ప్రైవేట్ బ్యాంకులు రూ.1,93,033 కోట్ల రుణాల‌ను ర‌ద్దు చేయ‌గా, విదేశీ బ్యాంకులు రూ.22,790 కోట్ల రుణాలు ర‌ద్దు చేశాయి.

అందులోనూ ఒక్క 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలోనే బ్యాంకులు రూ. 2,37,206 కోట్ల రుణాలు ర‌ద్దు చేయ‌డం విశేషం. ఇందులో పీఎస్‌బీల వాటా రూ. 1.78 ల‌క్ష‌ల కోట్లు కాగా,  ప్రైవేట్ బ్యాంక్‌ల వాటా రూ.53,949 కోట్లుగా ఉంది.

అప్పు తీసుకున్న వ్య‌క్తి లేదా సంస్థ తిరిగి చెల్లించే అవ‌కాశాలు దాదాపు లేన‌ప్పుడు బ్యాంక్‌లు లోన్ల‌ను రైట్ ఆఫ్ చేస్తాయి. గ‌తేడాది చాలా మంది ఆర్థిక ప‌రిస్థితి స‌రిగా లేక ఊహించిన స్థాయిలో లోన్ రిక‌వ‌రీలు సాధ్యం కాలేద‌ని, అందుకే లోన్ల ర‌ద్దు మొత్తం ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

కాగా, బ్యాంకులు త‌మ బ్యాలెన్స్ షీట్ల‌ను క్లియ‌ర్ చేసుకోవ‌డానికి ఈ రుణాల‌ను ర‌ద్దు చేసినా, రుణం తీసుకున్న వాళ్లు వాటిని తిరిగి చెల్లించాల్సిందే అని ఆర్బీఐ స్ప‌ష్టం చేస్తోంది.