ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నిర్ధారణ  

ఏపీలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి చెందిన ఓ మహిళకు కొత్త స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. రాజమండ్రి రూరల్‌ మండలం హుక్కుంపేట సమీపంలోని రామకృష్ణనగర్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్‌ మహిళ ఒకరు ఈనెల 22న యూకే నుంచి విమానంలో ఢిల్లీకి వచ్చారు. 

ఆమెను రిసీవ్‌ చేసుకునేందుకు ఆమె కుమారుడు ఢిల్లీకి వెళ్లారు. యూకేలో కరోనా పరీక్షలు చేయించుకున్నా అక్కడ ఫలితాలు రాకుండానే ఆమె బయలుదేరి భారత్‌కు వచ్చినట్టు తెలిసింది. స్వదేశంలో కూడా ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు చేశారు. ఫలితాలు వచ్చేవరకు ఆమె అక్కడే క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండగా, అక్కడ నుంచి పరారై రాజమహేంద్రవరం రావడానికి బయలుదేరారు. ఆమె ఢిల్లీ నిజాముద్దీన్‌ ట్రైన్‌ ఎక్కినట్టు పసిగట్టిన పోలీసులు ధ్రువీకరించుకున్నారు.

ఇంగ్లండ్‌ నుంచి 23వ తేదీ అర్ధరాత్రి ఆంగ్లో ఇండియన్‌ మహిళ, ఆమె కుమారుడు రాజమహేంద్రవరం వచ్చారు. ఈ మహిళకు మాత్రమే యూకే స్ట్రెయిన్ సోకినట్లు వైద్య శాఖ నిర్ధారించింది. ఆమె కుమారుడికి నెగటివ్‌ వచ్చిందని తెలిపింది. వీరిని ప్రభుత్వాసుపత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్‌ గదుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 

అయితే బ్రిటన్ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన 114 మందిలో 111 మందికి కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాకినాడ వెంకట్ నగర్‌కు చెందిన వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ప్రైమరీ కాంటాక్ట్‌లో మరో ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. పరీక్షల నిమిత్తం నమూనాలను హైదరాబాద్ సి‌సి‌ఎమ్‌బికి పంపించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

మరో ముగ్గురిని గుర్తించాల్సి ఉందని, నలుగురు పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్‌గా సుమారు వెయ్యి మందికి టెస్టులు నిర్వహిస్తున్నామని వెల్లడించింది.