రామమందిర నిర్మాణ అంచనా వ్యయం రూ.1,100 కోట్లు 

అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంచనా వ్యయాన్ని శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. ఆలయ నిర్మాణానికి మొత్తం రూ.1,100 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆలయ నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది.

ప్రధాన ఆలయ నిర్మాణానికే రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.వంద కోట్లకు పైగా విరాళాలు సమకూరాయని పేర్కొంటూ  స్వదేశీ నిధులతోనే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని శ్రీరామ్‌‌ జన్మభూమి ట్రస్ట్‌ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరీజీ మహరాజ్ స్పష్టం చేశారు.

 4 లక్షల గ్రామాల్లో, 11 కోట్ల కుటుంబాలను ఆలయ విరాళాల కోసం కలవనున్నట్లు ఆయన తెలిపారు. సమాజంలో అన్ని వర్గాల వారిని ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యులను చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించాయిరు. విరాళాల కోసం కొన్ని రోజుల క్రితం విదర్భలో ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలైందని, బొంబే ఐఐటీలు, ఢిల్లీ, మద్రాస్, గౌహతి, ఎల్‌ అండ్ టీ, టాటా గ్రూప్స్‌కు చెందిన ప్రత్యేక  ఇంజనీర్లు కాంప్లెక్స్ ఫౌండేషన్ రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారని ఆయన వెల్లడించారు.