బెయిల్‌పై ఉండి పాలిస్తున్నది జగన్ ఒక్కడే

31 కేసులు, 11 సీబీఐ, 5 ఈడీ కేసులున్న ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్ప మరెవ్వరు లేరని బిజెపి మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ మీద కూడా ఇన్ని లేవని ఆయన చెప్పుకొచ్చారు.  
కోర్టులు వెంటనే తీర్పు నిచ్చే పరిస్థితి లేనందునే జగన్ సీఎంగా ఉన్నాడని పేర్కొంటూ ఒక్క తీర్పు వస్తే జగన్ ఉండాల్సిన స్థానం జైలే అని స్పష్టం చేశారు. బెయిల్‌పై ఉండి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది జగన్ ఒక్కడే అంటూ ఎద్దేవా చేశారు. 
 
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు దేశంలో ఎక్కడా జరగడంలేదని బిజెపి నేత ధ్వజమెత్తారు. వైసీపీకి 151 సీట్లు వచ్చాయని బలం అనుకుంటే పొరపాటని హెచ్చరించారు.  అది వాపు మాత్రమే అని స్పష్టం చేశారు. కనబడిన ఎవ్వరినీ వదలకుండా నెత్తి మీద చెయ్యి వేసి, మొహం మీద ముద్దులు పెట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వమని జగన్ అడిగారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా జగన్‌ను నమ్మి అత్యద్భుత పాలన అందిస్తారనుకున్నారని పేర్కొన్నారు. 
 
అయితే ఎన్నికలకు ముందు జగన్ ప్రజల నెత్తి మీద వేసిన చెయ్యి భస్మాసుర హస్తం అని ప్రజలకు ఇప్పుడు తెలిసిందని దయ్యబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో విచిత్రమైన మనిషి బయటకు వచ్చారని విమర్శించారు. జగన్‌లో విచిత్రమైన మనిషి ఉన్నారని ముందే తనకు తెలిసని, ఆయన వ్యక్తిత్వం, మనస్తత్వం తనకు అప్పుడే తెలుసని చెప్పుకొచ్చారు. పిలిస్తే వెళ్లి కలిసా తప్పితే జగన్ అంటే ఇష్టం లేదన్నారు. ఎన్నికలకు ముందు దొంగ ప్రేమ చూపించారని మండిపడ్డారు.
ప్రజా వేదిక సెమీ ఇంజనీరింగ్ బిల్డింగ్ నట్లు,.బోల్టులు విప్పి వేరో చేట పెట్టేయవచ్చు…కానీ కూల్చివేసాడని మండిపడ్డారు. ప్రజాధనంతో నిర్మించిన భవనాలు కూల్చివేసే సీఎం దేశంలో జగన్ ఒక్కడే అని ధ్వజమెత్తారు. అన్నా క్యాంటీన్‌లను పేరు మార్చి జగనన్న క్యాంటీన్‌లుగా పేరు మార్చి కొనసాగించాల్సిన అవసరం ఉందని హితవు చెప్పారు.