ఉగ్రవాద నెట్‌వర్క్‌ గుట్టు రట్టు  

జమ్మూ-కశ్మీరు పోలీసులు ఉగ్రవాదంపై పోరులో విజయం సాధించారు. అవంతిపొరలో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌ గుట్టు రట్టు చేశారు. ట్రాల్, సంగం ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరిన సంఘటనలతో ఈ నెట్‌వర్క్‌కు ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ నెట్‌వర్క్‌‌కు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 

అవంతిపొరలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను జమ్మూ-కశ్మీరు పోలీసులు, భారత సైన్యం, సెంట్రల్ రిజర్వు పోలీస్ (సీఆర్‌పీఎఫ్) సంయుక్తంగా భగ్నం చేశాయి.  ఈ నెట్‌వర్క్‌కు ట్రాల్, సంగం ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరిన సంఘటనల్లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

పాకిస్థానీ హ్యాండ్లర్స్‌తో సంబంధాలున్న ఆరుగురు టెర్రర్ ఆపరేటివ్స్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరికి ఇటీవల భద్రతా దళాలపై గ్రెనేడ్లు విసిరిన సంఘటనలతో ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. వీరి నుంచి నేరపూరిత పత్రాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 

పోలీసులు అవంతిపొరలో గత నెలలో వగద్ ట్రాల్‌కు చెందిన బిలాల్ అహ్మద్ చోపన్, చాట్లం పాంపోర్‌కు చెందిన మురసలీన్ బషీర్ షేక్‌లను అరెస్టు చేశారు. వీరికి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు.