మహారాష్ట్రలో సొంతంగా బిజెపి ప్రభుత్వం!

భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ భరోసా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పలువురు నాయకులు బీజేపీలో చేరుతారని వెల్లడించారు. 

శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరడానికి దాదాపు 10 మంది వరకు బీజేపీ ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నారని ఎన్సీపీ చీఫ్‌ జయంత్‌పాటిల్‌ వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఫడ్నవిస్‌ ఈ ప్రకటన చేశారు.  శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి నుంచి అసంతృప్త ఎమ్మెల్యేలు బయటికి వెళ్లకుండా ఉండటానికే ఇటువంటి వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 

మహా వికాస్‌ ఆఘాడీ ఒక్కటిగా పోటీచేసి బీజేపీకి ఎక్కువ సామర్థ్యాన్ని ఇస్తుందని, ఇది బీజేపీ రాజకీయ క్షేత్రం ఏర్పరుచుకునేలా చేస్తుందని తెలిపారు. బీజేపీ కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో విస్తరించి ప్రభుత్వాలను ఏర్పాటుచేసిందని గుర్తుచేశారు. మహారాష్ట్రలో మన సొంత బలం మీద ఎదగడానికి అధికార పార్టీలు  తమకు అవకాశం కల్పించాయని పేర్కొన్నారు. 

ఇక్కడ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీని సృష్టిస్తామని ఫడ్నవీస్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ‘చెక్కు చెదరకుండా‘ ఉన్నారని స్పష్టం చేశారు. తన పార్టీలో చేరిన నాయకులు పరిణతి చెందినవారు, రాజకీయాలను అర్థం చేసుకున్నారని చెప్పారు. 

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ దేశ భవిష్యత్తు కాదని ఫడ్నవిస్‌ చురకలంటించారు. ఈ దేశం భవిష్యత్తు ప్రధాని నరేంద్రమోదీ అని ప్రజలకు ఒక ఆలోచన ఉందని మాజీ సీఎం తెలిపారు.