మమతా మంత్రివర్గ సమావేశానికి నలుగురు గైరాజర్!

అసెంబ్లీ ఎన్నిలు దగ్గర పడుతున్న పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బనెర్జీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా సీనియర్ మంత్రి అధికారి పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మరో 10 మంది ఎమ్యెల్యేలతో కలసి బీజేపీలో చేరగా, తాజాగా మమతా మంత్రివర్గ సమావేశానికి ఏకంగా నలుగురు మంత్రులు  గైరాజరు కావడం మరో కలకలం రేపుతున్నది. 

కాగా, వీరిలో ముగ్గురు సమావేశానికి ఎందుకు రాలేదో సరైన వివరణ ఇచ్చినట్లు పార్టీ ప్రధాన ‌ కార్యదర్శి పార్థా చటర్జీ తెలిపారు. ఉత్తర బెంగాల్‌ అభివృద్ధి శాఖ మంత్రి రవీంద్ర ఘోష్ము ఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలుపెట్టిన ఓ ప్రచార పర్యవేక్షణలో బిజీగా ఉన్నానని చెప్పగా, పర్యాటక శాఖ మంత్రి గౌతమ్‌ దేవ్‌ ఆరోగ్యం బాగోలేదని తెలిపారు. 

మత్య్సశాఖ మంత్రి చంద్రనాథ్‌ సిన్హా వచ్చే వారం ముఖ్యమంత్రి పర్యటన బాధ్యతలు చూస్తున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రజీబ్‌ బెనర్జీ మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. దోమ్‌జూర్‌ ఎమ్మెల్యే రజీబ్‌ కూడా కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తితో  ఉన్నారు. 

నవంబర్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ పార్టీలో నెపోటిజం (వారసత్వం) ఉందని తన అసమ్మతిని తెలియజేశారు. వారసత్వానికి పెద్దపీట వేయడంతో తాను నిరాశ చెందినట్లు ఆరోపించారు. కాగా, ఇటీవల తృణమూల్‌ను వీడి బిజెపిలో చేరిన సువేందు అధికారి కూడా పార్టీపై ఇటువంటి విమర్శలే చేసిన సంగతి విదితమే. 

తాజాగా అటవీ శాఖ మంత్రి రజీబ్‌ కూడా సువేందు వ్యాఖ్యలను పునరుద్ఘాటించడంతో పార్టీ ప్రధాన ‌ కార్యదర్శి పార్థా చటర్జీ నుండి పిలుపు వచ్చింది. సమావేశానంతరం రాజీకి వచ్చినట్లే కనిపించనప్పటికీ తాజాగా జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టడంతో పలు అనుమానాలకు తావునిచ్చినట్లైంది. ఈ ఫిరాయింపుల పరంపర ఇంకా కొనసాగవచ్చునన్న అనుమానాలకు తావునిస్తున్నాయి.