యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై భారత్ నిషేధం

 బ‌్రిట‌న్‌లో కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. యూకే నుంచి వ‌చ్చే విమానాల‌పై తాత్కాలికంగా నిషేధం విధించింది. 

ఈ నెల 22వ తేదీ రాత్రి 11.59 గంట‌ల నుంచి డిసెంబ‌ర్ 31 రాత్రి 11.59 గంట‌ల వ‌ర‌కు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌కు అనుమ‌తి లేదు అని కేంద్ర విమానయాన శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఫ్రాన్స్‌, జ‌ర్మ‌నీ, బెల్జియం, కెన‌డా, ఇట‌లీ, ఆస్ట్రియా వంటి దేశాలు యూకే నుంచి వ‌చ్చే విమానాల‌ను నిషేధించిన సంగ‌తి తెలిసిందే.  

 ఈ కొత్త ర‌కం వైర‌స్ ఇత‌ర దేశాల‌కు పాకితే వాటికీ విమాన స‌ర్వీసుల‌ను నిలిపేస్తామ‌ని కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరి స్ప‌ష్టం చేశారు. జ‌ర్మ‌నీ, బెల్జియం, ఫ్రాన్స్ లాంటి యురోపియ‌న్ దేశాలు యూకేకి ప్ర‌యాణాన్ని నిలిపేశాయి. 

ఒక‌వేళ ఈ కొత్త ర‌కం వైర‌స్ ఇత‌ర దేశాల‌కు పాకిన‌ట్లు తమకు స‌మాచారం వ‌స్తే ఆ దేశాల‌కు కూడా విమానాలు నిలిపేసే అంశాన్ని ప‌రిశీలిస్తాం అని ఆయ‌న వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతం యూకే నుంచి వ‌స్తున్న విమానాల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేసిన‌ట్లు కూడా విమాన‌యాన శాఖ వెల్ల‌డించింది. ఇప్ప‌టికే యూకే నుంచి బ‌య‌లుదేరిన విమానాలు లేదా డిసెంబ‌ర్ 22, రాత్రి 11.59 గంట‌ల‌లోపు వ‌చ్చే విమానాల్లో ప్ర‌యాణికుల‌కు ఈ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు.