జనవరి నుంచి ఫాస్టాగ్‌ త‌ప్ప‌నిస‌రి 

కొత్త ఏడాదితోపాటు కొన్ని కొత్త రూల్స్ కూడా రానున్నాయి. వ‌చ్చే జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌తోపాటు జీఎస్టీ, చెక్ మోసాలు, పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌లాంటి వాటిలో నిబంధ‌న‌లు మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 
 
1.  ఫాస్టాగ్‌ త‌ప్ప‌నిస‌రి: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌ను త ‌నిస‌రి చేస్తూ కేంద్ర రోడ్డు, ర‌వాణా, హైవేల మంత్రిశ్వ శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం డిసెంబ‌ర్ 1, 2017కు ముందు త‌యారైన అన్ని నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. ఈ మేర‌కు కేంద్ర మోటారు వాహ‌నాల చ‌ట్టం, 1989లో స‌వ‌ర‌ణ‌లు చేశారు. 
 
2. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ ప‌రిమితి పెంపు: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ ప‌రిమితిని పెంచుతూ ఆర్బీఐ ఈ మ‌ధ్యే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూ.2 వేల ప‌రిమితిని రూ.5 వేల‌కు పెంచింది. 
 
అయితే ఇది పూర్తిగా వినియోగ‌దారు విచక్ష‌ణాధికారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే యూజ‌ర్ కావాల‌నుకుంటే ఈ ప‌రిమితిని రూ.5 వేల‌కు పెంచుకోవ‌చ్చు. లేదంటే రూ.2 వేలకే ప‌రిమితం చేయ‌వ‌చ్చు.  
 
3. త్రైమాసిక జీఎస్టీ రిట‌ర్న్ ఫైలింగ్  సౌక‌ర్యం దేశ‌వ్యాప్తంగా ఉన్న సుమారు 94 ల‌క్ష‌ల మంది చిన్న వ్యాపార‌స్థులు ఇక సులువ‌గా, మూడు నెల‌ల‌కు ఓసారి గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిట‌ర్న్స్ ఫైల్ చేసే సౌక‌ర్యం క‌ల‌గ‌నుంది. 
 
ఏడాదికి రూ.5 కోట్ల లోపు అమ్మ‌కాలు ఉండే వ్యాపారాలు దీని కిందికి వ‌స్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తి నెల ఒక‌టి చొప్పున 12 రిట‌ర్న్స్ ఇవ్వాల్సి వ‌చ్చేది. అయితే ఇక నుంచి మూడు నెల‌ల‌కోసారి నాలుగు రిట‌ర్న్స్ దాఖ‌లు చేస్తే స‌రిపోతుంది. 
 
4. ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేయాలంటే 0 త‌ప్ప‌నిసరి: వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 15 నుంచి ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే క‌చ్చితంగా ముందు 0 యాడ్ చేయాల్సిందేన‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ (డీఓటీ) స్ప‌ష్టంచేసింది. 
 
5. టూ వీల‌ర్‌, కార్ల ధ‌ర‌లు పెరుగుతాయ్   కొత్త ఏడాదితో పాటు టూ వీల‌ర్‌, కార్ల ధ‌ర‌లు కూడా కొత్త‌వి రానున్నాయి. అన్ని త‌యారీ కంపెనీలు ధ‌ర‌లు పెంచ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. దేశంలో అతి పెద్ద కారు త‌యారీ సంస్థ మారుతీ సుజుకీ.. మోడ‌ల్‌ను బ‌ట్టి రేట్లు పెంచ‌నుంది. 
 
భారత్ లో త‌మ కార్ల ధ‌ర‌లు పెంచ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ఎంజీ మోటార్స్ ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి నుంచి రెనాల్ట్ కార్ల ధ‌ర‌లు రూ. 28 వేల వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. ఇక టూవీల‌ర్ల‌లో హీరో మోటోకార్ప్ త‌మ వాహ‌నాల ధ‌ర‌లు రూ.1500 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.