
సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఆరోజు ఆయన చేసిన ప్రకటన ఊరు,వాడను ఉద్యమవేదికపై ఏకంచేసింది. అప్పటినుంచి రాజధానిలోని 29 గ్రామాలు ఉద్యమ బాట పట్టి కదం తొక్కుతున్నాయి.
గత ఏడాది డిసెంబరు నెలలో ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఏ ఒక్క రోజూ విశ్రమించలేదు. తొలుత మూడు గ్రామాలు మందడం, వెలగపూడి, తుళ్లూరులో ప్రారంభమైన ఉద్యమం కొద్ది రోజుల్లోనే రాజధానిలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలను కదిలించింది. క్రమేపి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది.
మూడు రాజధానుల ప్రకటన నాటికి రాజధానిలో ఇంచుమించుగా రూ. 20 వేల కోట్ల విలువ చేసే పనులు ప్రారంభమై తుది దశకు చేరుకొన్నాయి. ఎంతోమందికి స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు లభించాయి. ప్రపంచంలోని ఐదు మేటి నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దేందుకు బృహత్తరమైన ప్రణాళిక రూపొందించి ఆ దిశగా అడుగులు పడ్డాయి.
ఇందులో రైతులదే కీలక భూమిక. రాజధాని కోసం తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు వారు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తమ పిల్లలతో పాటు రాష్ట్రంలో అందరి పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందని మనస్సుకు తమకు తాము సర్దిజెప్పుకొన్నారు. ప్రభుత్వం తమతో చేసుకొన్న ఒప్పందం మేరకు అభివృద్ధి పనులు, భవంతుల నిర్మాణాలు సాగడంతో తమ త్యాగానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు.
ఇంతలో 2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే అమరావతికి మరణ శాసనం లిఖించింది. తొలుత రాజధానిలో పనులు నిలిపేసింది. ఆ తరువాత ఏకంగా రాజధానినే ముక్కలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఉద్యమం రాజుకొంది.
ఉద్యమం తొలి రోజుల్లో రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకొన్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు అంగీకరించకపోవడంతో, రైతుల సొంత స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. పోరాటంలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు బయలుదేరిన మహిళలని అత్యంత పాశవికంగా పోలీసులు అడ్డుకొన్నారు.
మరోవంక కరోనా మహమ్మారి భయానక పరిస్థితులు సృష్టించినా సడలని దీక్షతో ఇండ్ల వద్ద నుండే నిరసనలు కొనసాగించారు. సంవత్సరంగా ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరు వచ్చి వారి డిమాండ్ లను వినే ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవ్వరు వారి గోడు పట్టించుకోననే లేదు.
More Stories
న్యూస్క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆప్ ఎంపీ ఇంట్లో సోదాలు
ఆసియా క్రీడల్లో పారుల్ చౌదరి, అన్నురాణిలకు స్వర్ణ పతకాలు