రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి ఏడాది 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో ప్రధాన రాజధాని కార్యకలాపాలను అమరావతి నుండి తరలించేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ అమరావతి రైతులు చేపట్టిన రాజధాని పరిరక్షణ ఉద్యమం ప్రారంభమై నేటితో ఏడాది ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుండి అనేక అణచివేత చర్యలను ఎదుర్కొంటూ, దాదాపు ఏకాకిగా ఈ ఉద్యమాన్ని మహిళలు ముందుండి సాగించడం ప్రాధాన్యతను సంతరించుకొంది. 
 
ఉద్యమం సందర్భంగా సుమారు 130 మంది ప్రాణాలు కోల్పోయారు. నేడు ‘జనరణభేరి’ పేరిట భారీ బహిరంగ సభను రాయపూడి వద్ద జేఏసీ నేతలు జరుపుతున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే ఈ సభలో అన్ని రాజకీయ పక్షాల నేతలు కూడా పాల్గొంటున్నారు. 
 
గతంలో పలు చోట్ల ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్ట్ ఆ పేరుతో బలవంతంగా స్వాధీనం చేసుకున్న భూములకు నష్ట పరిహారం చెల్లించామని ఉద్యమాలు జరిగాయి. భూసేకరణను వ్యతిరేకిస్తూ జరిగాయి. కానీ ప్రపంచ చరిత్రలోనే రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములు ఇచ్చి, ఆ భూములతో రాజధాని నగరం అభివృద్ధి చేయమని పోరాటం జరగడం బహుశా మొదటిసారిగా చరిత్రకు ఎక్కింది. 
 
అమరావతి రాజధానిగా అనిర్ధారిస్తు రాష్ట్ర శాసన సభ గతంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినా, ఇప్పుడు అధికార పక్షం ఆ స్ఫూర్తికి విఘాతంగా వ్యవహరిస్తూ ఉండడం సహజంగానే ఈ ప్రాంత ప్రజలలో ఆగ్రవేశాలకు దారితీసింది. పోలీసులతో ఈ ఉద్యమాన్ని అణచివేసే విఫల ప్రయత్నం చేశారు. ఒక కులం వారు సాగిస్తున్న ఉద్యమం అంటూ అపనిందలు వేశారు. 

సరిగ్గా ఏడాది క్రితం అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీలో  మూడు రాజధానుల ప్రకటన చేశారు. ఆరోజు ఆయన చేసిన ప్రకటన ఊరు,వాడను ఉద్యమవేదికపై ఏకంచేసింది. అప్పటినుంచి రాజధానిలోని 29 గ్రామాలు ఉద్యమ బాట పట్టి కదం తొక్కుతున్నాయి. 

గత ఏడాది డిసెంబరు నెలలో ప్రారంభమైన అమరావతి ఉద్యమం ఏ ఒక్క రోజూ విశ్రమించలేదు. తొలుత మూడు గ్రామాలు మందడం, వెలగపూడి, తుళ్లూరులో ప్రారంభమైన ఉద్యమం కొద్ది రోజుల్లోనే రాజధానిలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా జిల్లాలను కదిలించింది. క్రమేపి రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. 

మూడు రాజధానుల ప్రకటన నాటికి రాజధానిలో ఇంచుమించుగా రూ. 20 వేల కోట్ల విలువ చేసే పనులు ప్రారంభమై తుది దశకు చేరుకొన్నాయి. ఎంతోమందికి స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు లభించాయి. ప్రపంచంలోని ఐదు మేటి నగరాల్లో అమరావతిని ఒకటిగా తీర్చిదిద్దేందుకు బృహత్తరమైన ప్రణాళిక రూపొందించి ఆ దిశగా అడుగులు పడ్డాయి. 

ఇందులో రైతులదే కీలక భూమిక. రాజధాని కోసం తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేటప్పుడు వారు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తమ పిల్లలతో పాటు రాష్ట్రంలో అందరి పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుందని మనస్సుకు తమకు తాము సర్దిజెప్పుకొన్నారు. ప్రభుత్వం తమతో చేసుకొన్న ఒప్పందం మేరకు అభివృద్ధి పనులు, భవంతుల నిర్మాణాలు సాగడంతో తమ త్యాగానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశించారు.

ఇంతలో  2019లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే అమరావతికి మరణ శాసనం లిఖించింది. తొలుత రాజధానిలో పనులు నిలిపేసింది. ఆ తరువాత ఏకంగా రాజధానినే ముక్కలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఉద్యమం రాజుకొంది. 

ఉద్యమం తొలి రోజుల్లో రోడ్ల పక్కన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో టెంట్లు వేసుకొన్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు అంగీకరించకపోవడంతో, రైతుల సొంత స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. పోరాటంలో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు బయలుదేరిన మహిళలని అత్యంత పాశవికంగా పోలీసులు అడ్డుకొన్నారు.

మరోవంక కరోనా మహమ్మారి భయానక పరిస్థితులు సృష్టించినా సడలని దీక్షతో ఇండ్ల వద్ద నుండే నిరసనలు కొనసాగించారు. సంవత్సరంగా ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరు వచ్చి వారి డిమాండ్ లను వినే  ప్రయత్నం చేయలేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎవ్వరు వారి గోడు పట్టించుకోననే లేదు.