రిగ్గింగ్ జరిగిందంటూ సుప్రీంకోర్టుకు ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని, ఆ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. 
 
జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ స్టేట్స్ లోని 62 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లకు జరిగిన ఎన్నికలను అనర్హతగా ప్రకటించాలంటూ రిపబ్లికన్ పార్టీకి చెందిన టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్ టన్ తో సహా17 రాష్ట్రాల అటార్నీలు ఇప్పటికే సుప్రీంకోర్ట్ లో పిటిషన్ లు వేశారు. 
 
తన పిటిషన్ ను కూడా వీటితో కలిపి విచారించాలని కోరుతూ ట్రంప్ బుధవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ట్రంప్ ట్వీట్ చేశారు. అన్ని స్వింగ్ స్టేట్స్ లో బైడెన్ కన్నా తనకే వేలాది ఓట్లు ఎక్కువగా వచ్చాయని పేర్కొన్నారు. 
 
ఎన్నికల్లో ఫిక్సింగ్ జరిగితే తప్ప తాను ఓడిపోయే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అయితే పెన్సిల్వేనియా స్టేట్ లో ట్రంప్ లా సూట్ ను కోర్టు మంగళవారమే కొట్టేసింది.