టిడిపి నేతల కార్లపై రాళ్ళ దాడి 

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్ళు లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణ నెలకొని ఒకరిపైఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. శుక్రవారం తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో నిర్వహించనున్న టిడిపి కార్యక్రమానికి హాజరయ్యేందుకు టిడిపి జాతీయ నాయుడు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ లు శంకర్‌ యాదవ్‌, దొమ్మలపాటి రమేష్‌, చినబాబు లు బయలుదేరారు. 

వీరంతా బి.కొత్తకోట కు వస్తున్న క్రమంలో అంగళ్ళు లో వైసిపి నాయకులు, టిడిపి నాయకులను అడ్డుకున్నారు. రాళ్లతో దాడి చేశారు. శంకర్‌ యాదవ్‌ కారును, తంబల్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ కారును వైసిపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. 

ఈ దాడిలో మదనపల్లె టిడిపి నాయకుడు రాటకొండ మధుబాబు కి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు టిడిపి కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉద్రిక్తత నడుమ అంగుళ్ళు రహదారిపై 10 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టిడిపి నాయకులను అరెస్ట్‌ చేశారు.  

వైసీపీ దాడిలో గాయపడ్డ టీడీపీ నేతలను  టిడిపి అధినేత చంద్రబాబునాయుడు  ఫోన్లో పరామర్శించారు. ఈ దాడిని ఖండిస్తూ వైసీపీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి గాయపడిన వారిని అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. 

వైసీపీ దౌర్జన్యాలకు ప్రజలే బుద్దిచెబుతారని హెచ్చరించారు.  నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పరామర్శకు వెళ్తున్న నాయకులపై దాడి చేయడం గర్హనీయమంటూ  జగన్ ఫాసిస్ట్ పాలనకు ఈ దాడులు అద్దం పడుతున్నాయని ధ్వజమెత్తారు. 

రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాకు గండికొట్టారని దుయ్యబట్టారు.  తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నేరగాళ్ల రాజ్యంగా రాష్ట్రాన్ని మార్చారని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.