టోల్ గేట్ సిబ్బందిపై వైసిపి మహిళా నేత దాడి

నన్నే టోల్‌ ఫీజు చెల్లించమంటారా?  అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ మహిళా నాయకురాలు టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుపెట్టేందుకు ప్రయత్నించిన బ్యారీకేడ్ ను తోసేసి టోల్ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించారు. 
 
గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద జరిగిన ఈ సంఘటన ను కొద్దిమంది మొబైల్ ఫోన్లో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవళ్ల రేవతి బుధవారం ఉదయం  విజయవాడకు బయలుదేరి వెళ్తున్నారు.
మధ్యలో గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ వద్ద టోల్‌ ఫీజు కోసం కారును ఆపిన టోల్ సిబ్బందిపై ఆమె చేయిచేసుకున్నారు. నన్నే టోల్‌ చెల్లించాలని చెబుతావా…? నేనెవరో తెలియదా..? నా కారు చూడలేదా..?  అంటూ టోల్ సిబ్బందిపై పరుష పదజాలంతో దూషించారు.
కారుకు అడ్డంగా పెట్టిన బారికేడ్ ను ఆమె స్వయంగా  తోసేశారు. ఆమెను అడ్డగించబోయిన సిబ్బందిపై ఆగ్రహంతో బూతులు తిడుతూ చేయి చేసుకున్నారు. నన్నే ఆపుతావా.. నీకెంత ధైర్యం అంటూ కోపంతో ఊగిపోయారు.
అడ్డంగా పెట్టిన బారికేడ్‌లను స్వయంగా తొలగించుకొని కారు స్టార్ట్ చేయించుకుని విజయవాడ వెళ్లిపోయారు. రేవతి హడావుడితో టోల్ గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. తోటి వాహనదారులు ఆశ్చర్యపోయారు. టోల్‌గేట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.