నా కన్నా కేసీఆర్ పెద్దనటుడు

“నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశా..నా కన్నా పెద్దనటుడు” అంటూ మాజీ ఎంపీ విజయశాంతి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీలో చేరిన తర్వాత మొదటిసారిగా నేడు నాంపల్లిలోని తెలంగాణ బిజెపి కార్యాలయంపై వచ్చారు. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను స్థాపించిన   తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసేలా కేసీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ నమ్మక ద్రోహి అంటూ ధ్వజమెత్తారు.  అందుతే జుట్టు, లేకపోతే కాల్లు పట్టుకుంటారు. కుట్రలు చేయడంలో, అవమానిచడం లో నెంబర్ వన్ అంటూ దుయ్యబట్టారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు రాఖీ కట్టేందుకు రూ.లక్షరూపాయలు లేవన్న కేసీఆర్ నేడు రూ.లక్షకోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు. తాను బీజేపీలో ఉండగా 1998 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పని చేసినట్లు చెప్పారు. 

“నేను బీజేపీలో ఉంటే కేసీఆర్ కాంగ్రెస్ లో ఉన్నారు. అలయన్స్ లో ఉండగా..తెలంగాణ కోసం ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం పడిపోతుందని ఒత్తిడి తెచ్చారని, చంద్రబాబు కారణంగానే అప్పట్లో బీజేపీని  వీడాను” అంటూ ఆమె తెలిపారు. 

బీజేపీని వీడి ఉద్యమం చేస్తుంటే కొంతకాలానికి టీడీపీలో కేసీఆర్ కు మంత్రి పదవి రాకపోవడంతో అప్పటికే ఉదృతంగా ఉన్న తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ తనని తాను అందరిలో ప్రొజెక్ట్  చేసుకొని కుట్రలకు పాల్పడినట్లు విజయశాంతి ఆరోపించారు. 

అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారన్న విజయశాంతి కేసీఆర్ కు తెలంగాణ ప్రజల కంటే డబ్బు మీదనే ఎక్కువ ప్రేమ అని దయ్యబట్టారు. కేసీఆర్ ఆక్రమ సంపాదనను తెలంగాణా ప్రజలకు పంచాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను  డల్లాస్ చేస్తా, సింగపూర్ ను చేస్తానని మాయమాటలు చేసిన కేసీఆర్ తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలని ఆమె నిలదీశారు.

“రెండుసార్లు అవకాశం ఇచ్చాం. తెలంగాణ ప్రజలు అమాయకులు కదా..ఇంక మాకు ఓపికలేదు. ఆరేళ్లలో ఏం చేశారు. ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ అభివృద్ధి ఇదే కదా మనకు కావాల్సింది. మరి ప్రజలకు కేసీఆర్ ఏం చేస్తున్నారు. పైన దేవుడు ఉన్నాడు” అంటూ పేర్కొన్నారు.

తెలంగాణలో తాను తప్ప ఇతర పార్టీలు, నేతలు ఉండకూదని కేసీఆర్ కుట్ర చేశారని విజయశాంతి ఆరోపించారు. కానీ బీజేపీ ఉందని, కేసీఆర్ పాపం పండిందని ఆమె హెచ్చరించారు. మంచి చేసేవాళ్లు ఇబ్బంది పడుతుంటే .దేవుడు వాళ్లకి చేయందించి కాపాడుతాడని ఆమె చెప్పారు.