కేసీఆర్ పాలనలో వ్యవసాయ వ్యవస్థ విధ్వసం 

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ వ్యవస్థ విధ్వంసానికి గురైందని బిజెపి సీనియర్ నేత మురళీధరరావు మండిపడ్డారు. కేసీఆర్ తీసుకున్న ఆరు నిర్ణయాల వల్ల రాష్ట్రం నాశనమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతపు పశువధపై బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. 

రెగ్యులేటెడ్ క్రాప్ట్ పాలసీ రైతుల వినాశనానికి కారణమవుతోందని పేర్కొంటూ లోపభూయిష్టమైన ఈ పాలసీపై వ్యవసాయ శాస్త్రవేత్తలో చర్చలకు బీజేపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజనను కేంద్రం అమలు చేస్తున్నా ఈ పథకాన్ని తెలంగాణలో మాత్రం అమలు చేయడం లేదని విచారం వ్యక్తం చేశారు. 

సరిగ్గా లేని క్రాప్ పాలసీ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని మురళీధరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న మూడు వ్యవసాయ  విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వైస్ ఛాన్స్‌‌లర్స్, బోర్డ్ ఆఫ్ మేనేజ్‌‌మెంట్స్‌‌ లేరని ఎద్దేవా చేశారు. 

దీంతో జాతీయ స్థాయిలో పరిశోధనా  ర్యాంకింగ్స్‌‌లో మనం చాలా దిగువకు పడిపోయాని తెలిపారు. రుణమాఫీ సబ్సిడీ విషయంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. వ్యవసాయం, రైతు ఆదాయం పెంపులో పశుపోషణ కీలకమని చెబుతూ కానీ రాష్ట్రంలో క్యాటిల్ పాలసీ లేదని దుయ్యబట్టారు. .

కర్నాటకలో గోవధ విషయంలో యడ్యూరప్ప ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. పశుధనం విషయంలో ముఖ్యమైన చర్యలు తీసుకుంటోందని కొనియాడారు. తెలంగాణలో కూడా కర్నాటక లాంటి చట్టాన్ని తీసుకురావాలని మురళీధరరావు డిమాండ్ చేశారు.