కాంగ్రెస్ తో కలిసి సర్వసం కోల్పోయా 

కాంగ్రెస్ పార్టీతో కలసి నడిచినందుకు తాను సర్వసం కోల్పోయానని, ఆ పార్టీతో చేతులు కలపడంతో తనకు కన్నీళ్లే మిగిలాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి (ఎస్) నేత హెచ్ డి కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. అదే బిజెపితో కలిసి ఉంటె  తాను ఇంకా ముఖ్యమంత్రిగా  కొనసాగి ఉండేవాడినని వాపోయారు. 
 
కాంగ్రెస్‌ మద్దతుతో 2018లో ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే తాను కన్నీరుపెట్టుకోవాల్సి వచ్చిందని పశ్చాత్తాపం ప్రకటించారు. అయితే కాంగ్రెస్ తో చేతులు కలిపితే ఏం జరుగుతుందో తనకు ముందే తెలుసునని చెప్పారు.
 
2018లో జరిగిన ఎన్నికల్లో బిజెపి 105 సీట్లు, కాంగ్రెస్‌ 79, జేడీఎస్‌ 37 సీట్లు సాధించాయి.  అయితే అత్యధిక సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, మ్యాజిక్‌ ఫిగర్‌కు 8 సీట్ల దూరంలో నిలిచింది. కాగా, బీజేపీని అధికారానికి దూరంచేయడానికి కాంగ్రెస్‌, జేడీఎస్ చేతులు కలిపాయి. 
 
జేడీఎస్‌కు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ఆపార్టీ నేత కుమార స్వామిని కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది. ఆ ప్రభుత్వం ఏడాది కాలంలోనే కూలిపోయింది. ఈనేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌తో అనవసరంగా చేతులు కలిపానని కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు.
 
బీజేపీతో మంచి సంబంధాలు కొనసాగించి ఉంటే తాను ఇప్పటికీ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండేవాడినని కుమారస్వామి పేర్కొన్నారు. 2006 నుంచి 2017 వరకు తాను సంపాదించుకున్న మంచిపేరును కాంగ్రెస్‌తో పొత్తువల్ల కోల్పోయానని చెప్పారు. 2018లో కాంగ్రెస్‌ చేసినట్లు, 2008లో బీజేపీ తనను బాధించలేదని వెల్లడించారు. 
 
కాగా, రాజకీయ పొత్తులకు కాంగ్రెస్ తగిన పార్టీ కాదని ఆయన ఇదివరలో స్పష్టం చేశారు.  సంకీర్ణ ధర్మాన్ని ఆ పార్టీ ఎప్పుడు పాటించాడని విరుచుకు పడ్డారు.