ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మతాంతర వివాహాలను ఆపేందుకు కొత్తగా ఆర్డినెన్సును తీసుకువచ్చిన నేపథ్యంలో లక్నో నగరంలో హిందూ యువతి, ముస్లిమ్ యువకుడితో మతాంతర వివాహ వేడుకను పోలీసులు అడ్డుకున్నారు.
ఓ హిందూ యువతికి, ముస్లిమ్ యువకుడితో బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో వివాహం జరగాల్సి ఉండగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. రెండు మతాలకు చెందిన వారు ముందుగా లక్నో జిల్లా మెజిస్ట్రేట్ నుంచి వివాహానికి అనుమతి పొందాలని పోలీసులు వధూవరుల కుటుంబాలకు సూచించారు.
ఒక వర్గానికి చెందిన అమ్మాయి మరో వర్గానికి చెందిన అబ్బాయిని వివాహం చేసుకుంటున్నట్లు తమకు సమాచారం అందిందని, దీంతో వారిని పోలీసు స్టేషనుకు పిలిచి చట్టవిరుద్ధ మార్పిడి ఆర్డినెన్సు కాపీని అందజేశామని పోలీసులు చెప్పారు.
రెండుమతాల వారు పెళ్లి చేసుకునేందుకు లక్నో జిల్లా మెజిస్ట్రేట్ నుంచి లిఖితపూర్వక అనుమతి పొందాలని లక్నో పోలీసు అధికారి సురేష్ చంద్ర రావత్ కోరారు. రెండు వర్గాల కుటుంబాలు సమ్మతితో వివాహం చేసుకుంటున్నాయని, వారు మతం మార్చుకునే ఉద్దేశం లేదని కుటుంబాలు చెపుతున్నాయి.
బలవంతంగా మత ప్రయోజనం కోసం మతమార్పిడులు జరిగేలా వివాహాలు చేసుకోవడం చట్టవిరుద్ధమని మతమార్పిడి నిషేధ ఆర్డినెన్సు చెబుతోంది.
వివాహం తర్వాత మతం మార్చుకోవాలని యోచిస్తున్న వారు తమ ఉద్ధేశాన్ని కనీసం రెండు నెలల ముందుగానే జిల్లా మెజిస్ట్రేటుకు తెలియజేయాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. వివాహం కోసం మతం మార్చే వ్యక్తిని అరెస్టు చేసి బెయిలు కూడా ఇవ్వరు.
More Stories
పూంచ్లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు
జమ్మూకాశ్మీర్లో భారీ ఉగ్రదాడి.. ఎయిర్ఫోర్స్ కాన్వాయ్పై కాల్పులు
వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్ఇండియా