హెచ్1బీ వీసాలపై   ట్రంప్ ఆంక్షలు రద్దు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలపై విధించిన రెండు ఆంక్షలను కాలిఫోర్నియా స్టేట్ లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ (ఫెడరల్ జ్యుడీషియరీలో భాగం) రద్దు చేసింది. ట్రంప్ సర్కార్ ఈ రెగ్యులేషన్స్ పై తొందరపడిందని, ఎలాంటి పారదర్శకత పాటించలేదని స్పష్టం చేసింది.

కరోనా నేపథ్యంలో అమెరికన్ లకు ఎక్కువ ఉద్యోగాలు దొరకాలన్న ట్రంప్  విదేశాల నుంచి హెచ్1బీ వీసాలపై ఉద్యోగులను తీసుకునే విషయంలో అక్టోబర్ లో ఆంక్షలు విధించారు. హెచ్1బీ వీసాపై తీసుకునే విదేశీ ఉద్యోగులకు కనీస శాలరీ అమెరికన్ ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఉండాలని ఒక నిబంధనను తెచ్చారు. దీనివల్ల కంపెనీలు అమెరికన్ ఉద్యోగులను తొలగించి, తక్కువ జీతాలకు  వచ్చే విదేశీ ఉద్యోగులను తీసుకునేందుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. 

అలాగే హెచ్1బీ వీసాపై వచ్చే ఉద్యోగులకు అర్హత నిబంధనలను కూడా కఠినతరం చేస్తూ మరో నిబంధనను తెచ్చారు. మొదటి నిబంధన అక్టోబర్ నుంచే అమలులోకి రాగా, రెండో నిబంధన ఈ నెల 7 నుంచి అమలులోకి రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హెచ్1బీ వీసాలపై ఆంక్షలు సరికాదంటూ గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, ఇతర ఐటీ కంపెనీలు, యూఎస్ చాంబర్​ ఆఫ్​ కామర్స్, బే ఏరియా కౌన్సిల్, స్టాన్ ఫర్డ్, తదితర యూనివర్సిటీలు కోర్టులో లా సూట్ ను దాఖలు చేశాయి. 

దీనిపై కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ జడ్జి జెఫరీ వైట్ తీర్పు చెప్పారు. కరోనా వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ పతనమైందని, కంపెనీలు, ఉద్యోగులు ఇబ్బందుల్లో పడ్డారని జడ్జి చెప్పారు. అయితే అమెరికా అభివృద్ధిలో విదేశాల నుంచి వచ్చిన ఉద్యోగులు, వ్యాపారవేత్తల పాత్ర కూడా చాలా ఉందని పేర్కొన్నారు. కాగా, అమెరికన్ కంపెనీలు విదేశాల నుంచి స్కిల్డ్ ఎంప్లాయీలను నియమించుకునేందుకు ఏటా 85 వేల హెచ్1బీ వీసాలు జారీ అవుతుంటాయి. వీటిలో 70 శాతం  (ప్రస్తుతం 6 లక్షల వీసాలు)  భారత్,  చైనా పౌరులకే దక్కుతుంటాయి.