సినీనటుడు, ఎంపీ సన్నిడియోల్‌కు కరోనా 

బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్ పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కొవిడ్-19 పాజిటివ్ బారిన పడ్డారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉంటున్న సన్నీడియోల్ కు పరీక్షిస్తే కరోనా పాజిటివ్ అని తేలిందని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థీ చెప్పారు. 
 
ఎంపీ సన్నీడియోల్, అతని స్నేహితులు కుల్లూ జిల్లా నుంచి ముంబై నగరానికి వెళ్లాలనుకున్నారు. కాని సన్నీడియోల్ కరోనా పరీక్ష చేయించుకోగా అతనికి పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య కార్యదర్శి చెప్పారు.  64 ఏళ్ల సన్నీడియోల్ ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకొని  విశ్రాంతి తీసుకునేందుకు కుల్లూ జిల్లాలోని మనాలీ సమీపంలోని ఫాం హౌస్ లో గడపగా, ఆయన కరోనా బారిన పడ్డారు.  
 
 ఇలా ఉండగా, దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు 40వేలకుపైగా కేసులు రికార్డయ్యాయి. నిన్న 31,118 పాజిటివ్‌ కేసులు రికార్డు కాగా.. తాజాగా గడిచిన 24గంటల్లో 36,604 కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల 94,99,414కు చేరాయి.
 
మరో 501 మంది మృతి చెందగా, మృతుల సంఖ్యా 1,38,122కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,28,644 క్రియాశీల కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది. గత 24 గంటల్లో 43,062 కొత్తగా డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 89,32,647 మంది కోలుకున్నారని తెలిపింది.