కార్టూనిస్ట్‌ రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ కేసు 

సుప్రీంకోర్టును విమర్శించినందుకు గాను కార్టూనిస్ట్‌ రచితా తనేజాపై కోర్టు ధిక్కరణ  చర్యల కింద కేసు నమోదు చేసేందుకు అటార్నీ జనరల్‌ కెకె. వేణుగోపాల్‌ అనుమతినిచ్చారు.
 
ఇటీవల కోర్టు ఇచ్చిన తీర్పులపై వరుసగా కార్టూనిస్ట్‌ ట్వీట్‌లు చేశారని, ఇది అత్యున్నత న్యాయస్థానాన్ని అవమానించడమేనని, నిర్లక్ష్యంగా దాడికి పాల్పడటమని, న్యాయస్థానాన్ని దూషించడమేనని ఆయన స్పష్టం చేశారు. 
 
రిపబ్లిక్‌ టివి ఎడిటర్‌ ఆర్నాబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంపై  ”శానిటరీ పానెల్స్‌ ” పేరుతో కార్టూనిస్ట్‌ రచితా తనేజా విమర్శలు చేశారు. దీంతో ఆమెపై కోర్టు ధిక్కరణ చర్యల కింద కేసు నమోదు చేయాలంటూ లా విద్యార్థి ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌కు అనుమతి లభించింది. 
 
ఇటీవల ప్రముఖ ఆర్టిస్ట్‌ కునాల్‌ కమ్రాపై కూడా కోర్టు ధిక్కరణ చర్యల కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆర్నాబ్‌ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడాన్ని విమర్శిస్తూ.. కునాల్‌ కమ్రా ట్వీట్లు చేయడం గమనార్హం.