చాలా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి 

ఇప్పుడు మెజారీటీ దేశాలు చైనాతో వ్యాపార సంబంధాలు కొనసాగించాలని కోరుకోవడంలేదని, ఆయా దేశాలు ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు చూస్తున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 
 
 లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న గడ్కరీ డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ నిర్వహించిన ఒక వెర్చువల్‌ సమావేశంలో మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి భారత్‌కు ప్రత్యేకించి తయారీ రంగానికి సానుకూలాంశం కాగలదని చెప్పారు. 
 
భారత్‌ ఎగుమతుల అభివృద్ధికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.  ఒకపక్క చైనా నుంచి భారత్‌ దిగుమతులను తగ్గించుకుందని, అదే సమయంలో మన దేశ ఎగుమతులూ పెరిగాయని పేర్కొన్నారు. ఎగుమతులు-దిగుమతుల విభాగంలో సానుకూల ధోరణులు కనిపిస్తున్నాయని వివరించారు
 
ప్రత్యేకించి ఎంఎస్‌ఎంఈ రంగం మహ్మమ్మారి సవాళ్లును అధిగమిస్తోందని గడ్కరీ భరోసా వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్, రోబోటిక్స్, పర్యావరణం, పునరుత్పాదకత, స్మార్ట్‌ విలేజెస్‌ అభివృద్ధి, ఈ-మొబిలిటీవంటి అంశాల్లో భారత్‌ పురోగమిస్తోందని తెలిపారు. ఆయా రంగాల్లో ఎంఎస్‌ఎంఈలు కూడా పనిచేసే వీలుందని చెప్పారు . 
 
ఐఐటీ, ఎన్‌ఐఐటీ వంటి విద్యా, పరిశోధనా సంస్థల భాగస్వామ్యంతో పెద్ద సంఖ్యలో ఎక్స్‌లెన్స్‌ సెంటర్లను ఏర్పాటుపై ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ దృష్టి సారిస్తోందని గడ్కరీ వెల్లడించారు. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ప్రస్తుత వార్షిక టర్నోవర్‌ విలువ రూ.80,000 కోట్లు. వచ్చే రెండేళ్లలో ఈ విలువను రూ.5 లక్షల కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు. 
 
కాగా, హొరాసిస్‌ ఆసియా సదస్సు 2020ను ఉద్ధేశించి చేసిన ఒక ప్రసంగంలో గడ్కరీ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రజల్లో సానుకూలత, విశ్వాసం నింపడం ముఖ్యమని గడ్కరీ పేర్కొన్నారు. ప్రతికూలత, అనుమానాస్పద వాతావరణం వల్ల పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారుతుందని హెచ్చరించారు.
గణాంకాల ప్రాతిపదకన చూస్తే, ‘‘మనం త్వరలో సాధారణ పరిస్థితికి చేరుతున్న విషయం అర్థం అవుతుంది’’ అని గడ్కరీ పేర్కొన్నారు.  ఆర్థిక యుద్ధంలో విజయం సాధించే దిశలో కరోనా మహమ్మారిని జయిస్తామన్న భరోసానిచ్చారు.