జేసీ దివాకర్‌రెడ్డికి రూ 100 కోట్ల జరిమానా

టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి  ఆంధ్రప్రదేశ్‌ మైనింగ్‌ అధికారులు త్రిశూల్‌ సిమెంట​ ఫ్యాక్టరీలో జేసీ భారీ ఎ‍త్తున అక్రమాలకు పాల్పడ్డారని రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించారు. రూ. 100 కోట్ల జరిమానా కట్టకపోతే ఆర్అండ్ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేపడతామని హెచ్చరించారు. 

అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి  14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు.

తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందారు. అంతేకాకుండా అనుమతులు వచ్చాక పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారు. అక్రమ మైనింగ్‌తో పాటు జేసీ ట్రావెల్స్‌ నింబంధనల ఉల్లంఘనపై కూడా అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. 

మరోవైపు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో దివాకర్‌రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్‌ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని అధికారులు ఇదివరకే ప్రకటించారు. 

జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్‌ మైనింగ్‌ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.