ద్వీపాల‌ను పూర్తిస్థాయిలో హ‌రిత ఇంధ‌నంగా చేస్తాం   

భార‌త‌దేశంలోని ద్వీపాల‌ను పూర్తిస్థాయిలో హ‌రిత ఇంధ‌న ద్వీపాలుగా మారుస్తామ‌ని   విద్యుత్ ‌శాఖ మంత్రి ఆర్ కె. సింగ్ ప్రకటించా రు. దీనికి సంబంధించి ఆయా ద్వీపాల్లో హ‌రిత ఇంధ‌న వినియోగానికి సంబంధించి పున‌ర్ వినియోగ ఇంధ‌న వ‌న‌రుల మీద ఆధార‌ప‌డేలా ఆదేశాలిచ్చి ల‌క్ష్యాల‌ను నిర్దేశించామ‌ని స్ప‌ష్టం చేశారు.
 
3వ గ్లోబ‌ల్ రీ ఇన్వెస్ట్ సంద‌ర్భంగా మాల్దీవులు దేశంతో నిర్వ‌హించిన స‌మావేశంలో  మాట్లాడుతూ  పున‌ర్‌  వినియోగ శ‌క్తి ప్రాజెక్టుల‌ను ప్రోత్స‌హించే విష‌యంలో మాల్దీవుల‌కు పూర్తిస్థాయిలో స‌హ‌కార‌మందిస్తామ‌ని హామీ ఇచ్చారు. మాల్దీవుల్లో పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. 
వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించి రెండుశాతం లోపే వుండేలా పెట్టుకున్న లక్ష్యాన్ని భార‌త‌దేశం చేరుకుంద‌ని చెబుతూ  అలా ల‌క్ష్యం ప్ర‌కారం చేరుకున్నకొన్ని దేశాల్లో భార‌త‌దేశం ఒక‌టని మంత్రి పేర్కొన్నారు.
ఇప్ప‌టికే భార‌త‌దేశంలో ఒక ల‌క్షా 36 వేల మెగావాట్ల ఆర్ ఇ (రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ) సామర్థ్యాన్ని పొందింద‌ని, మ‌రో 57వేల మెగావాట్ల విద్యుత్ శ‌క్తి సామ‌ర్థ్యం అద‌నంగా వ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని వివరించారు. విద్యుత్ శ‌క్తిని స‌మ‌ర్థ‌వంతంగా వాడుకోవ‌డానికిగాను శ‌క్తివంత‌మైన కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశం అమ‌లు చేస్తున్నద‌ని చెబుతూ  దేశంలో 11 మిలియ‌న్ లెడ్ బ‌ల్బుల‌ను వీధి దీపాలుగా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని కేంద్ర‌మంత్రి తెలిపారు.
ప‌ర్యావ‌ర‌ణ హిత ఇంధ‌న వ‌న‌రుల‌ ద్వారా కార్బ‌న్ డ‌యాక్స‌యిడ్ ఉద్గారాల‌ను త‌గ్గించుకోవ‌డం త‌మ‌కు అత్యంత ముఖ్య‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఎంతో సుంద‌ర‌మైన మాల్దీవులు కూడా పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌ వినియోగానికి అత్యంత ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు.
2030 నాటికి నాలుగు ల‌క్ష‌లా యాబైవేల మెగావాట్ల ఆర్ ఇ సామ‌ర్థ్యాన్ని సాధించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని శ్రీ సింగ్ పేర్కొన్నారు. భూగోళం వేడెక్క‌డంవ‌ల్ల ద్వీప‌దేశాలు, ద్వీప ప్రాంతాలు ప్ర‌మాదంలో ప‌డ‌తాయ‌నే ఆందోళ‌న‌ల్ని ఆయ‌న వ్యక్తం చేశారు.
మాల్దీవులకు చెందిన మంత్రి హుస్సేన్ ర‌షీద్ హాస‌న్ మాట్లాడుతూ  చ‌మురు దిగుమ‌తుల‌పై ఆధార‌ప‌డ‌డాన్ని త‌గ్గించుకుంటున్నామ‌ని, పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రుల‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌ని తెలిపారు. పెట్టుబ‌డిదారుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించే విధానాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని త‌ద్వారా ఆర్ ఇని ప్రోత్స‌హిస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.