తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు తధ్యం  

తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. కేసీఅర్ అవినీతి ప్రభుత్వం కూలిపోతుందని, ఎన్నికలు తప్పవని ఆయన చెప్పారు. రాంనగర్‌లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కో డివిజన్‌కు రూ  5 కోట్లు ఇస్తున్నారని, టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండని ఓటర్లకు పిలుపునిచ్చారు. 

బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలెవరూ వెళ్ళటం లేదని చెప్పారు.  సారు‌‌.. కారు.. కేసీఆర్ ఇక రారు అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. కేసీఆర్, ఆయన కుటుంబం మంచిగా ఉండాలన్న సంజయ్ ఆయన అవసరం ప్రజలకు లేదని స్పష్టం చేశారు. 

గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలబడదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుబాటు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వస్తున్నారని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాగ్రత్త అని హెచ్చరించారు. కేంద్రం త్వరలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతుందని హెచ్చరించారు.

భారత్‌ బయోటెక్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ఇంట్లో చెప్పే వచ్చానని.. చావుకు భయపడేది లేదని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌ విగ్రహాలను టచ్‌ చేస్తే కచ్చితంగా దారుసలాంను కూల్చేస్తామని మరోసారి బండి సంజయ్‌ హెచ్చరించారు.

 ఎక్కువ రోజులు నిలబడని ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావట్లేదని తెలిపారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలని హితవు చెప్పారు.